
గోవాలో క్యాసినో సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, సిటీబ్యూరో: పేకాట కోసం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిన ఓ రౌడీషీటర్ బుధవారం అర్థరాత్రి రెచ్చిపోయాడు. పనాజీలోని కంపాల్లో ఉన్న ఓ క్యాసినోలో వీరంగం సృష్టించాడు. స్వల్ప వివాదం నేపథ్యంలో విచక్షణ కోల్పోయి కర్రతో సెక్యూరిటీ గార్డులపై విరుచుకుపడ్డాడు. ఈ ఉదంతంలో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోవా నుంచి పారిపోవడానికి దబోలిం విమానాశ్రయానికి వెళ్తుండగా సదరు రౌడీషీటర్ను పనాజీ పోలీసులు మార్గమధ్యంలో గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. చార్మినార్లోని మిశ్రీగంజ్కు చెందిన అబ్దుల్ అల్తాఫ్కు నేరచరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. పేకాట కోసం తరచు గోవా వెళ్లివచ్చే ఇతగాడు రెండు రోజుల క్రితం అలానే వెళ్లాడు. బుధవారం రాత్రి గోవా రాజధాని పనాజీలోని కంపాల్లో ఉన్న క్యాసినో కార్నివాల్ అనే క్యాసినోకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత స్వల్ప విషయమై క్యాసినో నిర్వాహకులతో అల్తాఫ్కు వివాదం ఏర్పడింది. యాజమాన్యం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆ క్యాసినో సెక్యూరిటీ గార్డులు అల్తాఫ్కు సర్దిచెప్పడంతో పాటు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో విచక్షణ కోల్పోయిన అల్తాఫ్ క్యాసినోలోని ఇంటర్నల్ స్టెయిర్ కేస్కు సంబంధించిన బ్లస్టర్ (పక్కన ఉండే కర్ర) విరగ్గొట్టి, దాన్ని తీసుకుని సెక్యూరిటీ గార్డులపై దాడి చేశాడు. ఈ బ్లస్టర్కు కింది భాగంలో ఇనుప తొడుగు ఉండటంతో మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవాలో పని చేస్తున్న ధీరు శర్మ, సౌత్ గోవాలోని షిరోడాకు చెందిన సత్యం గోవాన్కర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సహచర సెక్యూరిటీ గార్డులు బాంబోలింలోని గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధీరు శర్మ చనిపోగా... సత్యం పరిస్థితి విషమంగా ఉంది. అదును చూసుకుని ఆ క్యాసినో నుంచి బయటపడిన అల్తాఫ్ తాను బస చేసిన హోటల్ గదికి వెళ్లాడు. అక్కడ నుంచి తన లగేజీ తీసుకుని నార్త్ గోవాలోని దబోలిం విమానాశ్రయానికి బయలుదేరాడు. విషయం పోలీసుల వద్దకు వెళ్లి, కేసు నమోదయ్యే లోపు హైదరాబాద్ వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించాడు. క్యాసినో కార్నివాల్లో జరిగిన ఈ ఘాతుకంపై గురువారం తెల్లవారుజామున 3.10 గంటలకు పనాజీ పోలీసులకు సమాచారం అందింది. తక్షణం అప్రమత్తమైన నార్త్ గోవా ఎస్పీ రాహుల్ గుప్తా నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. క్యాసినోలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడు అల్తాఫ్గా గుర్తించారు. అతడు విమానాశ్రయానికి వెళ్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యంలో అరెస్టు చేశారు. ఈ నేరాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు అల్తాఫ్ అక్కడకు ఎందుకు వచ్చాడు? వివాదానికి కారణం ఏంటి? అనే విషయాలు ఆరా తీస్తున్నారు.
స్వల్ప వివాదం నేపథ్యంలో చంపేసిన నగర వాసి
నిందితుడు మైలార్దేవ్పల్లిఠాణా రౌడీషీటర్ అల్తాఫ్
దబోలిం ఎయిర్పోర్టు దారిలోపట్టుకున్న పనాజీ పోలీసులు