
రూ.61లక్షలు టోకరా!
రూ.21 వేలతో మొదలుపెట్టి
ఆన్లైన్ ద్వారా ఎరవేసిన సైబర్ నేరగాళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఆన్లైన్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో నిండా ముంచారు. భారీ లాభాలు వస్తాయంటూ ఆశపెట్టి, రూ.21 వేలతో మొదలుపెట్టి, వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ చూపించి రూ.61 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి (68) ఆన్లైన్లో వచ్చిన ఎక్స్పర్ట్స్ ప్రో లిమిటెడ్ ప్రకటన కనిపించింది. బులియన్ మార్కెట్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని అందులో ఉంది. దీనికి ఆకర్షితుడైన అతను ఆ సంస్థకు చెందిన యాప్ను లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచాడు. తొలిసారిగా ఈ ఏడాది మార్చి 27న రూ.21 వేలు పెట్టుబడి పెట్టారు. ఆపై బాధితుడితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన నేరగాళ్లు స్థానిక మార్కెట్ కాకుండా అంతర్జాతీయ ట్రేడింగ్ చేస్తే డాలర్లలో లాభాలు వస్తాయని, అందుకు అవసరమైన సలహాలు సూచనలు తామే ఇస్తామని నమ్మించారు. ఇలా కొంత పెట్టుబడి పెట్టించిన తర్వాత ఆయా స్టాక్లకు సంబంధించిన మార్జిన్ వాల్యూస్ పడిపోతున్నాయని, లాభాలు పొందటంతో పాటు ఉన్న నిధులు కోల్పోకుండా ఉండాలంటే మరికొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాలని భయపెట్టారు. ఆ మొత్తం పెట్టిన బాధితుడు తనకు ట్రేడింగ్లో ఆసక్తి లేదని, తనకు ఉన్న నిధులు డ్రా చేసుకుని నిష్క్రమించాలని భావిస్తున్నట్లు నేరగాళ్లకు చెప్పాడు. దీనికి అనుమతించని వారు మరికొంత పెట్టుబడి పెట్టాలని బెదిరించారు. తన వద్ద ఉన్న మొత్తం ఇన్వెస్ట్ చేసిన బాధితుడు ఇకపై తాను పెట్టుబడి పెట్టలేనని స్పష్టం చేశాడు. అయినా వారి ఫోన్లు, ట్రేడింగ్ కొనసాగింది. ఈ నెల 21న బాధితుడు తన కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్లారు. అలా వెళ్తున్న విషయం నేరగాళ్లకు చెప్పి, తన ట్రేడింగ్ ఖాతా నిర్వహించమని కోరారు. అందుకు అంగీకరించిన వారు అతను తిరిగి వచ్చేలోపు అనేక ఫోన్లు చేశారు. ఇంటికి చేరుకున్న బాధితుడు వారిని సంప్రదించగా... అత్యవసరంగా రూ.10 లక్షలు చెల్లించకపోతే ట్రేడింగ్ ఖాతానే కోల్పోవాల్సి వస్తుందని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి బాధితుడు చెల్లింపులు ఆపేశాడు. కొన్ని రోజులకు బాధితుడికి ఫోన్ చేసిన మరో నేరగాడు కోల్పోయిన నిధులను తిరిగి వచ్చేలా చేస్తానని నమ్మించాడు. దీనికోసం నామమాత్రం పెట్టుబడి పెట్టాలని, ట్రేడింగ్ యాప్లో 75 వేల అమెరికన్ డాలర్లు (రూ.64.16 లక్షలు) ఉన్నాయని చూపించాడు. కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేయకపోవడంతో ఆ ఖాతా లాక్ అయిందని, ఆ మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే అన్లాక్ చేయించాలన్నాడు. ఈ పేరుతో మరికొంత మొత్తం స్వాహా చేశారు. ఇలా మొత్తం రూ.61.95 లక్షలు సైబర్ నేరగాళ్లకు చెల్లించిన బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆన్లైన్లో ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ట్రేడింగ్లో లాభాలంటూ మోసం
యాప్లో బ్యాలెన్స్చూపిస్తూ వ్యవహారం
కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు