
ప్రాణం కాపాడిన హైడ్రా
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా ఆధీనంలోని డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (డీఆర్ఎఫ్) బృందాలు శుక్రవారం ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. ఒకే సమయంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరగడంతో ఎక్కడికక్కడ ఈ బృందాలు రంగంలోకి దిగాయి. అమీర్పేటలో జరిగిన ప్రమాదం నుంచి రాజేష్ను (25) సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం అమీర్పేట, పటాన్చెరుల్లో ఒకే సమయంలో అగ్గి రాజుకుంది. సారథి స్టూడియో సమీపంలోని ఐదు అంతస్తుల దివ్య శక్తి అపార్ట్మెంట్స్ రెండో ఫ్లోర్లో మధ్యాహ్నం 3.30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ డబ్బింగ్ స్టూడియోలో మంటలు అంటుకోగా... సమాచారం అందుకున్న హైడ్రా కంట్రోల్ రూమ్ డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన ఆ ప్రాంతానికి పంపింది. ఏసీ యూనిట్కు సంబంధించిన కంప్రెషర్ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు గుర్తించాయి. స్టూడిలో చిక్కుకుపోయిన రాజేష్ చౌదరిని బయటకు తీసుకువచ్చాయి. ఈ మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నిలువరించారు. స్టూడియోలో చిక్కుకున్న రాజేష్ను ల్యాడర్ ద్వారా వెళ్లి కాపాడిన డీఆర్ఎఫ్ సభ్యుడు శ్రీకాంత్ను కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. అలాగే... పటాన్చెరు పారిశ్రామికవాడలోని పాటి గ్రామంలో అను ఫర్నీచర్ గోదాంలోనూ అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకున్న మూడు డీఆర్ఎఫ్ బృందాలు మంటల వ్యాప్తిని నిలువరించాయి.
శుక్రవారం ఒకేసారి రెండుచోట్ల అగ్ని ప్రమాదాలు
సమాచారం అందటంతోనే రంగంలోకి డీఆర్ఎఫ్
అమీర్పేటలో రాజేష్ అనే యువకుడి రెస్క్యూ