
నీటి కషా్టలు
డయాలసిస్ చికిత్సకు
శంషాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి
● నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న వైద్యులు
● మౌలిక వసతులుకల్పించాలని విజ్ఞప్తి
శంషాబాద్: ప్రభుత్వ దవాఖానాకు డయాలసిస్ రోగుల తాకిడి పెరుగుతోంది. గతంలో ప్రయివేటు లేదా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన డయాలసిస్ చికిత్స గత ఆరునెలలుగా ప్రభుత్వ దవాఖానాలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే ఉండి డయాలసిస్ చికిత్స అవసరమైన రోగులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానా బాటపడుతున్నారు.
నీరే ప్రధానం...
డయాలసిస్ చికిత్సలో అత్యంత ప్రధానమైంది పూర్తిగా మంచినీరే. నీటితో పూర్తిగా డయాలసిస్ చికిత్సను అందజేస్తారు. ప్రస్తుతం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో ఆరు నెలల కిందట డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని కోసం ప్రత్యేక గదితో పాటు ఐదు మంచాలు ఏర్పాటు చేశారు. ఒకే సమయంలో ఐదుగురు రోగులకు ఇక్కడ చికిత్స చేయడానికి కావాల్సిన పరికరాలతో పాటు అవసరమైన టెక్నీషియన్లు, నర్సులు కూడా ఉన్నారు. అన్ని ఉన్నా డయాలసిస్కు కావల్సిన ప్రధాన వనరై మంచి నీరు మాత్రం కావల్సినంతగా లేదు. దీంతో మూడు షిప్టులుగా సేవలందించేందుకు అవకాశమున్నా ప్రస్తుతం ఇక్కడ రోజు ఏడుగురు రోగులకు మాత్రమే డయాలసిస్ చికిత్సను అందజేస్తున్నారు. దవాఖానాలో ఉన్న బోరులో నీరు సరిపోకపోవడంతో మున్సిపాలిటీ ట్యాంకరును ఆశ్రయిస్తున్నారు. అయినా నీరు అవసరాలకు సరిపడా అందుబాటులో లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోగులకు తప్పని నిరీక్షణ
మంచి నీటి కొరత కారణంగా కొత్తగా డయాలసిస్ కోసం వస్తున్న రోగులకు చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంటుంది. నీటి సమస్య తీరితే రోగుల సేవలను పెంచేందుకు పూర్తి అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగులు తమకు స్థానికంగానే డయాలసిస్ చికిత్స అందించాల్సిందిగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సిఫార్సులు సైతం చేయించుకుంటున్నారు.
దాతలు ముందుకొస్తే...
ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ రోగులతో పాటు సాధారణ రోగులకు సైతం నీటి కష్టాలు తీర్చేందుకు మరో బోరు వేయాల్సిన అవసరముంది. ప్రభుత్వ ఏర్పాటు చేసే లోపు దాతలు ముందుకొచ్చి బోరు వేయించి నీటి సమస్యను తీర్చితే రోగులకు సాంత్వన చేకూరుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కొత్త ఆస్పత్రి నిర్మాణం త్వరగా చేపడితే నీటి కష్టాలు తీరే మార్గాలున్నాయని వైద్యులు, సిబ్బంది ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి
డయాలసిస్ చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. డయాలసిస్ చికిత్సకు గదితోపాటు అన్ని పరికరాలు, టెక్నీషియన్లు, నర్సులు పూర్తి స్థాయిలో ఉన్నారు. చికిత్సకు ప్రధానమైన నీరే ఇక్కడ కొరతగా ఉంది. సమస్యను ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం బోరు సరిగా రావడం లేదు. మున్సిపాలిటీ ట్యాంకరుతో నీటి సరఫరా చేస్తుంది. సమృధ్ధిగా నీటి సౌకర్యం పెరిగితే మూడు షిప్టుల్లో డయాలసిస్ చికిత్సను పెంచేందుకు అవకాశముంటుంది.
– డాక్టర్ దుర్గలత, ఆస్పత్రి సూపరింటెండెంట్

నీటి కషా్టలు