పట్టాలపై మృత్యుఘంటికలు | - | Sakshi
Sakshi News home page

పట్టాలపై మృత్యుఘంటికలు

Jun 3 2025 7:00 AM | Updated on Jun 3 2025 7:00 AM

పట్టాలపై మృత్యుఘంటికలు

పట్టాలపై మృత్యుఘంటికలు

రైల్వేట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదాలు ● పట్టాలు దాటుతూప్రమాదాల బారిన పడుతున్న వైనం ● సెల్ఫీలు, రీల్స్‌ మాయలో పడి మృత్యువాత ● ఎంఎంటీఎస్‌, సబర్బన్‌ మార్గాల్లోనే ఎక్కువ

సాక్షి, సిటీబ్యూరో: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ మరికొందరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్‌లకు రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు యథేచ్చగా పట్టాలు దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్‌ తమను చేరే లోపు ట్రాక్‌ దాటేయొచ్చనే అతివిశ్వాసం కూడా నిండు ప్రాణాలను హరిస్తోంది. నగరంలోని ఎంఎంటీఎస్‌, సబర్బన్‌ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్‌లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఈ ట్రాక్‌లను దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు, అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు దాటాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్‌పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్‌పురా, ఉప్పుగూడ, మలక్‌పేట్‌, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్‌, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌, సికింద్రాబాద్‌ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

మలుపులు...మృత్యు పిలుపులు

‘‘లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే క్రమంలో నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌, భరత్‌నగర్‌, హఫీజ్‌పేట్‌, తదితర చోట్ల ట్రాక్‌ మలుపులు ఉన్నాయి. ఈ రూట్‌లో ట్రైన్‌ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్‌ వచ్చేలోపు దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్‌ శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే అది వందల మీటర్ల దూరం పరుగులు తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ మలుపుల వద్దనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ట్రాక్‌లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్‌కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి బ్రేక్‌ అప్లయ్‌ చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్‌ దూరంలో ఆగుతుంది. అప్పటికే ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్‌ లొకోపైలెట్‌ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సోషల్‌ మీడియా మేనియా....

సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్‌లపైన నించొని రకరకాల రీల్స్‌ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ యువత ఇలాంటి సోషల్‌ మీడియా మేనియాలో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు సనత్‌నగర్‌ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్‌ పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయత్నించి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్‌బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్‌ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఒకరు తెలిపారు.

ప్రమాదాలు ఇలా..

సంవత్సరం ప్రమాదాలు ఆత్మహత్యలు అనుమానాస్పద మృతి

2024 735 631 206

2025 (ఇప్పటికి) 214 189 57

– 2021లో 408 మంది ప్రమాదాలు బారిన పడగా, 2024 నాటికి ఆ సంఖ్య 735 కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement