
మూడు రోజులుగా అవే తిప్పలు
ఇబ్రహీంపట్నం: మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో ఈ పాస్ సర్వర్లు సక్రమంగా పనిచేయక ఆహారభద్రత కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదు. మూడు రోజులుగా ఇబ్బందులకు గురవుతున్నా అధికార యంత్రాంగం ఇంకా సరిచేయకపోవడం గమనార్హం. ఈనెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు నెలల బియ్యం ముందస్తుగా అంటే ఒక యూనిట్కు 18 కిలోల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం కోటాలకు ఒకేసారి వేలిముద్రలు వేస్తే పనిచేయడం లేదు. వేర్వేరుగా ఆరుసార్లు మిషన్పై నొక్కాల్సి వస్తోంది. దీనికితోడు ఈ పాస్ సర్వర్లు మొరాయిస్తుండడంతో మరింత జాప్యం అవుతోంది. 15 నిమిషాలకు ఒక కార్డుదారుని వేలిముద్రల ప్రక్రియ పూర్తవుతుండడంతో గంటకు నాలుగైదు కార్డులకు మించి నమోదు చేయలేని పరిస్థితి. దీంతో పనులు పక్కన పెట్టి జనాలు గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద పడి గాపులు కాస్తున్నారు. కోటా పంపిణీలో జాప్యం కారణంగా పలు షాపులు తెరిచేందుకు దుకాణదారులు జంకుతున్నారు. ఈపాస్ సర్వర్ మిషన్ ఇబ్బందులు తొలగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రేషన్ దుకాణాల వద్ద తప్పని పడిగాపులు