
చచ్చినా.. భూములివ్వం
మొయినాబాద్: తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం.. ఈ భూమి తప్ప మాకు మరెక్కడా భూమి లేదు.. మా భూములు తీసుకుంటే మేం ఎట్లా బతకాలి.. చస్తే ఇక్కడే చస్తాం కానీ భూములు వదిలిపెట్టమని .. మీరే న్యాయం చేయండి.. అంటూ కలెక్టర్ నారాయణరెడ్డి ఎదుట ఎనికేపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లోని 99 ఎకరాల ప్రభుత్వ భూమిని డైబ్బె ఏళ్లకు పైగా గ్రామానికి చెందిన యాబై మంది రైతులు సాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆ భూమిని గోషాల ఏర్పాటుకోసం తీసుకుంటోంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ నారాయణరెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్తో కలిసి ఎనికేపల్లి భూములను పరిశీలించారు. అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. తాతల కాలం నుంచి భూమిని దున్నుకుని బతుకుతున్నామని.. 1954లో అప్పటి ప్రభుత్వం తోకపట్టాలు ఇచ్చిందని కలెక్టర్కు వివరించారు. అప్పటి నుంచి 1983 వరకు పన్నులు కట్టామని.. వర్షాధార పంటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. భూములు సాగుచేసుకునేది ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేదలమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు తీసుకుంటే తమకు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.
చర్చిద్దాం రండి..
ఎనికేపల్లిలో ప్రభుత్వ భూమి సాగుచేసుకుంటున్న రైతులతో మాట్లాడిన కలెక్టర్ నారాయణరెడ్డి రైతులకు, గ్రామానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ అవసరం కోసం భూమిని తీసుకుంటోందని.. ఇందులో రైతులు దున్ని, విత్తనాలు వేయొద్దని అన్నారు. బుధవారం ఆర్డీఓ చంద్రకళ రైతులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తారన్నారు. రైతులు మధ్యాహ్నం 3 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి రావాలని సూచించారు.
తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం
తీసుకుంటే ఎట్లా బతకాలి
కలెక్టర్ ముందు ఎనికేపల్లి రైతుల ఆవేదన
న్యాయం జరిగేలా చూస్తాం: కలెక్టర్ నారాయణరెడ్డి