
అర్చనకు గ్రామీణ్ ప్రగతి స్కాలర్షిప్
ఆరేళ్ల పాటు రూ.లక్ష చొప్పున ఉపకార వేతనం
కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కుక్కల అర్చన పదోతరగతిలో 546 మార్కులు సాధించినందుకు గాను గ్రామీణ్ ప్రగతి ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. ఫరూఖ్నగర్ పరిధి బూర్గుల శివారులో ఉన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాదికి రూ.లక్ష చొప్పున ఆరేళ్ల పాటు ఉపకార వేతనం అందించనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రశేఖర్, పాఠశాల హెచ్ఎం శ్రీశైలం, సీఆర్పీ మల్లేశ్ విద్యార్థినిని అభినందించారు.
కేజీబీవీలో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
కొందుర్గు: కొందుర్గు కేజీబీవిలో పనిచేయటకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేకాధికారి షెకీనా నిస్సీ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వంట పనివారు, నైట్వాచ్ ఉమెన్, డే వాచ్ ఉమెన్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వంటపని, డే మరియు నైట్ వాచ్ ఉమెన్లకు 10వ తరగతి, అటెండర్కు ఇంటర్ అర్హత ఉండాలన్నారు. పై పోస్టులకు మండల పరిధిలోని మహిళలు మాత్రమే ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 86861 58456 నంబర్లో సంప్రదించాలన్నారు.
కారు బోల్తా.. డ్రైవర్ మృతి
షాబాద్: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. కొందుర్గు మండలం చిన్న ఉమ్మెంతాలకు చెందిన ఇసంతపురం శ్రీకాంత్(28) కొందుర్గులో ఓ వ్యక్తి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న విధుల్లో భాగంగా కారులో షాబాద్కు వచ్చాడు. తన స్నేహితుడు మహేశ్తో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో మరియాపురం శివారులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరగడంతో పాటు చేతికి బలమైన గాయాలయ్యాయి. మహేశ్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రులను అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు డ్రైవర్ శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేశ్ను మెరుగైన వైద్యం కోసం షాద్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.