
వందరోజుల ప్రణాళిక విజయవంతం చేయాలి
శంషాబాద్: శంషాబాద్ను స్వచ్ఛమైన.. పరిశుభ్రమైన పట్టణంగా మార్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిన వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ బి. సుమన్రావు అధ్యక్షతన మండలి భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వంద రోజుల ప్రణాళికలో పరిశుభ్రత చర్యలు, పచ్చదనం, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నిషేధం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజలందరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని పథకాలను అందజేస్తుందన్నారు. పర్యావరణహితంగా వ్యవహరించిన వాటర్మెన్ నాగేష్ను ఎమ్మెల్యే సన్మానించారు. మున్సిపల్ మేనేజర్ శ్రావణి, మాజీ వైస్చైర్మన్ బండిగోపాల్ యాదవ్, నార్సింగి ఏఎంసీ మాజీ చైర్మన్ డి.వెంకటేష్గౌడ్, మాజీ కౌన్సిలర్లు సంజయ్యాదవ్, వై.కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మైలారం సులోచన, స్థానిక నేతలు తోకల మురళి పాల్గొన్నారు.
రైతులకు వరి విత్తనాల కిట్ల పంపిణీ
శంషాబాద్ రూరల్: ‘గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం నాణ్యమైన విత్తన పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని రైతులకు ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ విత్తనాల కిట్లను అందజేశారు. మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద కేఎన్ఎం 1638 వరి రకం విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాల సాగుతో అధిక దిగుబడి పొందవచ్చిని ఎమ్మెల్యే సూచించారు. రైతులు పండించిన తర్వాత వీటిని గ్రామాల్లోని మిగతా రైతులకు విత్తనం కోసం ఇవ్వాలన్నారు. మండలంలోని 19 గ్రామాలకు ముగ్గురు రైతుల చొప్పున వరి విత్తనాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయధికారి శ్వేత తెలిపారు. ఒక్కో రైతుకు పది కిలోల వరి విత్తనాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి ఏడీ కవిత, తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ను స్వచ్ఛమైన పట్టణంగా మార్చుకోవాలి
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్