
‘జయ గ్రూప్స్’పై చర్యలు తీసుకోవాలి
పంజగుట్ట: తమ వద్ద ప్రీ లాంచింగ్ ఆఫర్లో ప్లాట్లు తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ అందంగా బ్రోచర్లు ముద్రించి వందలాది మంది నుంచి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన జయత్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (జయ గ్రూప్స్) సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు వర్మ కుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేష్, ఫణిలు మాట్లాడుతూ .. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి 2021 ఫిబ్రవరిలో కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేస్లో అన్ని హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశారని మొదటి వెంచర్గా హిల్టన్ జయ డైమెండ్ పేరుతో వెంచర్ ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తమకు పదేపదే ఫోన్లు చేసి చందానగర్ లోని గోపనపల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారన్నారు. కార్యాలయానికి వెళ్లగా హంగు, ఆర్భాటాలతో పాటు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారన్నారు. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మి రూ. 20 లక్షల నుంచి రూ.1.80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. రెండేళ్లలో ప్లాట్లు అప్పగిస్తామని చెప్పారని. గడువు ముగిసిన తర్వాత అడిగితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో తమకు చూపించిన స్థలం వద్దకు వెళ్లి ఆరా తీయగా సదరు ప్రాజెక్టు వేరే సంస్థకు చెందినదిగా తెలుసుకుని నివ్వెరపోయామన్నారు. మద్య తరగతికి చెందిన తాము పైసాపైసా కూడబెట్టుకుని ప్లాట్లు కోసం వెచ్చించామన్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలోనూ ఇదేతరహాలో మోసం చేసినట్లు తెలిసిందన్నారు. నిందితుడు కాకర్ల శ్రీనివాస్, మరోఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రస్తుతం బెయిల్పై దర్జాగా తిరుగుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు, ఈడీ కార్యాలయంలో, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలి తం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సంస్థ బాధితుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నా రని ఇరు ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో నిండా ముంచారు
రూ.300 కోట్లకు పైగా వసూలు
న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు