
అవయవదానానికి ముందుకు రావాలి
కేశంపేట: సమాజంలో ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఆల్ ఇండియా ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్ సోంటే శ్రీనివాస్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గుడూరు సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవయవాలను దానం చేస్తున్నట్టు అంగీకారపత్రాన్ని గాంధీ మెడికల్ ప్రిన్సిపాల్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలను వదిలిపెట్టి మానవత దృక్పథంతో అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మరణించిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెట్టడం, కాల్చి వేయడంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందుకే అందరూ మరణాంతరం అవయవదానానికి ముందుకు రావాలని సూచించారు.