
ఠాణా ఎదుట మహిళ హల్చల్
ఇబ్రహీంపట్నం రూరల్: ‘నేను చచ్చిపోతేనే న్యాయం జరుగుతుంది.. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయోజనం లేదు.. అధికారులెవరూ న్యాయం చేయడం లేదు’ అంటూ ఓ మహిళ ఆదిబట్ల ఠాణా ఎదుట హల్చల్ చేసింది. మహబూబ్నగర్ జిల్లా మూలమడ్తా తండా యోట్టం ప్రాంతానికి చెందిన కేతావత్ బుజ్జి, రామ్సింగ్ దంపతులు. 2021లో కుర్మల్గూడలో 100 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ అనుమ తులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందని అక్కడ ఉన్న 20కిపైగా నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం కూల్చివేశారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీకు ప్లాటు అమ్మి న వారి మీద కేసు పెట్టండి అని ఆర్డీఓ చెప్పడంతో పలుమార్లు పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బుజ్జి తన భర్త రామ్సింగ్ చంటి బిడ్డతో కలిసి వచ్చింది. తనకు ఒక్కతే కూతురు అని, ఆమె కోసమే రూ.లక్షలు పెట్టి ప్లాటు కొనుగోలు చేశామని పేర్కొంది. తనకు కిడ్నీ సమస్య ఉందని, తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరగడం లేదు.. చచ్చిపోతా అంటూ తన సంచిలో ఉన్న డబ్బా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాక్కొని పడేశారు. తర్వాత అవి నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్ కలగజేసుకుని సర్దిచెప్పారు.
చచ్చిపోతా అంటూ హైడ్రామా
సంచిలోంచి డబ్బాతీసి ఒంటిమీద పోసుకున్న మహిళ
నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు