
మోతాదు మించొద్దు
స్థానికం
షాబాద్: ఖరీఫ్లో పత్తి సాగు చేసే రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వలన పెట్టుబడులు పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని వివరిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయ సదస్సుల్లో కర్షకులకు అవగాహనకల్పిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా గడిచిన ఐదేళ్లుగా రైతులకు సరైన దిగుబడులు దక్కలేదు. దీంతో వరుస నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పెట్టుబడులు అదుపులో ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖఅధికారులు సూచిస్తున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే మార్గాలపై దృష్టిపెట్టాలని అవగాహన కల్పిస్తున్నారు.
వినియోగం ఇలా..
ఎకరా పత్తి సాగుకు పొలం దున్నే సమయంలో 50 కిలోల డీఏపీ చల్లుకోవాలి. విత్తనం నాటిన 20, 40, 60 రోజులకు మూడు సార్లు మొత్తం 90 కిలోల యూరియాను వర్షం పడిన సమయంలో వేయాలి. 25 కిలోల పోటాష్ ఎరువును విత్తనం నాటిన 60 రోజులకు యూరియాతో కలిపి వేసుకోవాలి. కానీ రైతులు రెండింతల ఎరువులు వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ఎరువులు, పురుగు మందుల వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి
అధికంగా వాడితేభూసారానికి ముప్పు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి సారించాలి
అవగాహన సదస్సుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు
సూచనలు పాటించాలి
రైతులు దిగుబడిపైనే కాకుండా పొలాల్లో భూసారాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టిసారించాలి. అవసరానికి మించి రసాయన ఎరువులు వాడొద్దు. పురుగు మందుల వినియోగంలో అధికారుల సూచనలు పాటించాలి.
– వెంకటేశం, వ్యవసాయశాఖ అధికారి, షాబాద్