
ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి
శంకర్పల్లి: ఈతకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూర్ చెందిన చిన్ననోళ్ల మహేశ్(32) తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రైవేటుగా ఉద్యోగి. ఆయనకు భార్య నాగమణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం తన స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి శంకర్పల్లి మండలం మిర్జాగూడ సమీపంలోని బతుకమ్మ కుంటలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు మహేశ్ కుంటలో పడి మృతి చెందాడు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
బైక్ను ఢీకొట్టిన లారీ.. మహిళ దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గుర్రంపోడు: బైక్ను లారీ ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని చేపూరు క్రాస్రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని బాలాపూర్కు చెందిన అంజుమఖాతూన్(43) కుమార్తె సఖీనాఖాతున్, అల్లుడు మహ్మద్ సలామ్ నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని పోచంపల్లిలో ఓ రైతు తోటలో కూలీ పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నారు. కుమార్తెను, అల్లుడిని చూసేందుకు అంజుమాఖాతున్, ఆమె భర్త అబ్దుల్ సలామ్తో కలిసి పోచంపల్లికి వచ్చారు. సోమవారం పని నిమిత్తం అల్లుడు మహ్మద్ సలామ్ తన బైక్పై అత్త అంజుమఖాతూన్, మామ అబ్దుల్ సలామ్ను ఎక్కించుకుని చేపూరుకు వెళ్లి తిరిగి పోచంపల్లికి వస్తుండగా.. చేపూరు క్రాస్ రోడ్డు వద్ద నల్లగొండ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజుమఖాతూన్ అక్కడికక్కడే మృతిచెందింది. మహ్మద్ సలామ్, అబ్దుల్ సలామ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంజుమఖాతూన్ మృతదేహాన్ని పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె సఖీనాఖాతూన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నిబంధనలు పాటించని న్యాయవాదులకు నోటీసులు
ఇబ్రహీంపట్నం: బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్న న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ నియమాల ప్రకారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటమిపాలైన కొంతమంది, ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ పేరుతో మరో కార్యావర్గాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. ఇది బార్ అసోసియేషన్ నియమ, నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. ఈ కార్యవర్గంతో పాటు ఇందుకు సహకరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ కౌన్సిల్కు సిఫారసు చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
మీటర్ల ‘గోల్మాల్’ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్ మీటర్ల గోల్మాల్ వ్యవహారంలో బాధ్యులపై వేటు పడింది. ఏఈ సహా లైన్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్లను సస్పెండ్ చేసింది. మంజూరైన మీటర్లను సంబంధిత వినియోగదారుల నివాసాలకు అమర్చకుండా గుట్టుగా నిల్వ చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో చేర్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సైబర్సిటీ సర్కిల్ ఇబ్రహీంబాగ్ డివిజన్ చిత్రపురి కాలనీలోని ఓ కాంట్రాక్టర్ ఇంట్లో 42 విద్యుత్ మీటర్లు లభ్యమైన విషయం తెలిసిందే. దుండిగల్, ఇబ్రహీంబాగ్, సరూర్నగర్లో విద్యుత్ మీటర్లు పక్కదారి పట్టిన విషయంపై మూడు రోజుల క్రితం సాక్షిలో ‘మీటర్ల గోల్మాల్’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై సీఎండీ ముషారఫ్ ఫా రూఖీ సీరియస్ కావడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రంగారెడ్డిజోన్ సీజీఎం పాండ్యానాయక్ అంతర్గత విచారణ చేపట్టి సీఎండీకి సమగ్ర నివేదిక అందజేశారు. ‘తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటీవ్ సొసైటీ’ పేరున జనవరి 25న 42 విద్యుత్ మీటర్లు జారీ చేసినట్లు గుర్తించారు. డిస్కం మంజూరు చేసిన ఈ మీటర్లను వినియోగదారుల ఇంటికి అమర్చకుండా కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి తన ఇంట్లోనే నిల్వ చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో వీటికి బిల్లులు కూడా జారీ చేశారు. ఈ అంశంపై స్థానిక ఏఈ భాస్కర్రావు సహా లైన్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్ల ప్రయేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మీటర్ల గోల్మాల్కు కారణమవడంతో పాటు సంస్థ ఆర్థిక నష్టాలకు కారణమైన ఏఈ సహా మీటర్ రీడర్, లైన్ ఇన్స్పెక్టర్లను డిస్కం యాజమాన్యం సోమవారం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా సదరు కాంట్రాక్టర్పై ఇప్పటికే రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించింది. బ్లాక్ లిస్ట్లో చేర్చడంతో పాటు లైసెన్సును రద్దు చేయాల్సిందిగా కోరుతూ సీఈఐ జీకి లేఖ రాసింది.

ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి