
లక్ష్యం.. నిర్లక్ష్యం
మిల్క్చిల్లింగ్ యంత్రాల్లో వినియోగించిన జలాలతో పాటు, నీటి వృథాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈటీ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. రూ.23 లక్షలు వెచ్చించి నిర్మించిన ఎఫిలియంట్ ట్రీట్మెంట్.. అధికారుల నిర్లక్ష్యానికి తప్పుపట్టిపోయింది. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోయింది.
కడ్తాల్: మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో నీటి వృథాను అరికట్టేందుకు పాడిపరిశ్రమాభివృద్ధి పథకం, రాష్ట్రీయ కర్షక్ వికాస్ యోజన పథకం కింద 2017లో రూ.23 లక్షలతో ఈటీ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రంలోని మిల్క్ చిల్చింగ్ చేసే సమయంలో యంత్రాలకు ఉపయోగించిన నీటిని శుద్ధి చేయడంతో పాటు, మురుగు సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. రీసైక్లింగ్ చేసిన నీటిని ఇతర అవసరాలతో పాటు.. చెట్లు, గడ్డి పెంచేందుకు వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలా నిత్యం 15 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి వినియోగించారు. నాలుగైదు సంవత్సరాలు ప్లాంట్ను ఉపయోగించారు. ఆ తరువాత నిర్లక్ష్యం చేయడంతో ఆ యంత్రం తుప్పుపట్టిపోతోంది.
నిత్యం 30వేల లీటర్లు
మండల కేంద్రంలో ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పాలశీతలీకరణ కేంద్రం.. అత్యధిక పాల ఉత్పత్తిలో సమైక్య రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు పొందింది. ప్రస్తుతం నిత్యం 30వేల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోంది. మండలంతో పాటు, కేశంపేట్, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, కందుకూర్ తదితర మండలాల నుంచి 100కు పైగా సొసైటీల నుంచి సేకరించిన పాలను.. ఈ కేంద్రంలో చిల్లింగ్ చేస్తారు. ఈ సమయంలో.. యంత్రాలకు పెద్ద మొత్తంలో నీటిని వాడుతుంటారు. అలా వాడిన నీరు.. మురుగు జలాలుగా మారి వెలుపలికి వస్తుంటాయి.
తీవ్ర దుర్వాసన
గతంలో మండల కేంద్రంలో నివాసాలు పెద్దగా లేక పోవడంతో మురుగు జలాలను అలాగే వదిలేసేవారు. పదేళ్ల క్రితం కేంద్రం సమీపంలోనే పాఠశాల ను ఏర్పాటు చేయగా.. వ్యర్థ జలాలతో వస్తున్న దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఇదే విషయమై పలుమార్లు ఉపాధ్యాయులు అప్పట్లో మేనేజర్, స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రం నుంచి పాఠశాల మీదుగా కుంటకు మురుగునీటిని తరలించేందుకు పైప్లైన్ వేశారు. ఆ లైన్ తరచూ పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వచ్చేది. అది భరించలేనంతగా ఉండటంతో.. అధికారులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2017లో ఈటీ ప్లాంట్ ఏర్పాటును ఏర్పాటు చేశారు.
నిరుపయోగంగా ఈటీ ప్లాంట్
నీటి వృథాను అరికట్టేందుకు
ఏడేళ్ల క్రితం ఏర్పాటు
పట్టించుకోని అధికారులు..
తుప్పుపట్టిన యంత్రం
చర్యలు తీసుకోవాలి
పాలకేంద్రంలో వాడిన నీరు వృథా కాకుండా శుద్ధి చేసి, ఇతర అవసరాలకు వినియోగించాలని స్థానికులు, పాడి రైతులు కోరుతున్నారు. ఈటీ ప్లాంట్ నుంచి వచ్చే నీటితో పాల కేంద్రంలో చొప్ప, గడ్డి సాగు చేయాలని, మొక్కలకు నీటిని అందించాలని పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

లక్ష్యం.. నిర్లక్ష్యం