● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు నిర్వహించే స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ఆదివారం కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని, వెబ్ సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. జనాభా గణనకు సంబంధించి 1,025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణన అని, డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. సీపీవో శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్వో సంపత్కుమార్ పాల్గొన్నారు.


