ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనాలు జాగ్రత్తగా నడపాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో మాట్లాడారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. మండలంలోని రైతులు ఆయిల్పామ్, సన్నరకాల ధాన్యం సాగు చేయాలని కోరారు. 23,131 రేషన్కార్డులు, 1,648 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. గ్రామాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు.
స్టాళ్ల పరిశీలన
వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్, పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్, నానో యూరియా విశేషాలు వెల్లడిస్తూ ప్రదర్శనకు పెట్టిన స్టాళ్లను, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పోషకపదార్థాలతో ఉపయోగాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ల పంపిణీ
రేపాక, నర్సక్కపేట, సోమారంపేట గ్రామాల అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన ఆక్వాగార్డ్ యంత్రాలను పంపిణీ చేశారు. రహీంఖాన్పేటకు చెందిన దివ్యాంగులు పల్లె రాజయ్యకు వీల్చైర్ అందజేశారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో శశికళ, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, సీడీపీవో ఉమారాణి, ఎస్సై అశోక్, డాక్టర్ జీవనజ్యోతి, మండల వ్యవసాయాధికారి ప్రదీప్, మండల విద్యాధికారి శ్రీనివాస్గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, సర్పంచులు కాత మల్లేశం, నేరెళ్ల విజయ్గౌడ్ పాల్గొన్నారు.


