ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు అందరికీ ఆచరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి విప్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ గొప్ప న్యాయవాది, మానవతా వాదిగా కీర్తి గడించారన్నారు. ఇతర వక్తలు మాట్లాడుతూ, ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారని, లండన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం అంబేడ్కర్కు మాస్టర్ ఆఫ్ ఆల్సైన్సెస్ ప్రధానం చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న 8 మంది జంటలకు రూ.2 లక్షల 50 వేల ప్రోత్సాహక బాండ్లను అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపరెడ్డి, రాజు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్రెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలు, సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. బీఆర్ఎస్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు శీలం రాజు, ఊరగొండ రాజు, కొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆఫీసులో జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నాయకులు సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కోడం రమణ, సూరం పద్మ తదితరులున్నారు. అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కత్తెర దేవదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆకునూరి బాలరాజు, రాగుల జగన్, రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు.


