సిరిసిల్లటౌన్: స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సిరిసిల్లలోని నేతన్నచౌక్లో నిరసన చేపట్టారు. ఎస్.కె. అఫ్రోజ్, సాయి, తేజ, ఎండి అజ్జు, చరణ్, వినయ్, నిఖిల్, శశాంక్, అఖిల్, అభిషేక్, కై లాస్, మనోజ్, వంశీ, నిఖిల్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో బుధవారం కలిసి విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, వి.వెంకటరమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్రెడ్డి, ఆకుల సత్యం ఉన్నారు.
వేములవాడరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హనుమంతు కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో వేములవాడరూరల్ మండలం బొల్లారంలో ప్రధానమంత్రి ముద్ర యోజనపై బుధవారం అవగాహన కల్పించారు. హనుమంతు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల లక్షణాలు, కొత్త యూనిట్ స్థాపనకు పరిశోధన ఎలా చేయాలి, కేంద్ర పథకాలు పీఎంఎంవై, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈపై అవగాహన కల్పించారు. ట్రైనర్ వంశీకృష్ణ, చార్టర్ అకౌంటెంట్ ఆంజనేయులు, ఈడీసీ మేనేజర్ జయంత్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటశివసాయి పాల్గొన్నారు.
ఇల్లంతకుంట/సిరిసిల్ల ఎడ్యుకేషన్: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన జానపద రచయిత, గాయని కట్కూరి స్నేహకు పీపుల్స్ మీడియా పాయింట్ శివంగి ఆత్మీయ పురస్కారాన్ని అందించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ‘అల్లిబిల్లి సోకులాడి చిట్టమ్మి..’ అనే పాటతో స్నేహకు పేరు వచ్చింది. ఇప్పటి వరకు వందకు పైగా పాటలు రాసి, పాడింది.
7న ‘సెస్’ సర్వసభ్య సమావేశం
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 7న నిర్వహిస్తున్నట్లు ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు బుధవారం తెలిపారు. సిరిసిల్ల శివారులోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని వివరించారు. సిరిసిల్ల ‘సెస్’ ఆఫీస్లో బుధవారం పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘సెస్’ జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు పాలకవర్గం నిర్ణయించింది. ‘సెస్’ సభ్యులకు ముందస్తు సమాచారం అందిస్తామని తెలిపారు.


