నిలువెల్లా సమస్యలే
ఇవీ ప్రధాన సమస్యలు
జిల్లా కేంద్రం.. అవస్థల వలయం
నాడు ఆదర్శం.. నేడు అథమం
అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీలు
నేడు మున్సిపల్ కౌన్సిల్ బాధ్యతల స్వీకరణ
ఇదీ సిరిసిల్ల స్వరూపం
సిరిసిల్ల: కార్మిక క్షేత్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రథమశ్రేణి మున్సిపాలిటీగా ఉన్నా రెండేళ్లుగా నిధులు లేక వసతులు కరువయ్యాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు(పవర్లూమ్స్) ఉన్న పట్టణంగా నిలుస్తున్నా కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో రాష్ట్రంలోనే ప్రాధాన్యత గల పట్టణంగా ముందు వరసలో ఉండేది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్లో అనేక పురస్కారాలు అందుకున్న పట్టణంలో నేడు ఎటూ చూసిన అపరిశుభ్ర పరిసరాలే కనిపిస్తున్నాయి. నిధులు రాక.. పాలకుల నిర్లక్ష్యంతో సిరిసిల్ల వెనుకబాటుకు గురవుతోంది. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా పట్టణంలోని ప్రధాన సమస్యలపై ‘సాక్షి’ కథనం.
గతమెంతో ఘనం
సిరిసిల్ల 1953లో తొలిసారిగా టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. పట్టణ జనాభా 12 వేలు ఉండేది. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, రెడ్డివాడ, సుభాష్నగర్, గాంధీనగర్, అంబేడ్కర్నగర్, పాతబస్టాండు ప్రాంతాలతో కలిసి ఉండేది. కాలక్రమంలో వెంకంపేట, శాంతినగర్, గోపాల్నగర్, పద్మనగర్, కొత్తబస్టాండు, రాయినిచెరువు ప్రాంతాలు పట్టణంలో కలిసిపోవడంతో బీ.వై.నగర్, పీ.ఎస్.నగర్, ఇందిరానగర్, తారకరామానగర్, గణేశ్నగర్, వంశీకృష్ణకాలనీ, రాజీవ్నగర్, భూపతినగర్లతో పట్టణం విస్తరించింది. ఏడేళ్ల కిందట సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాల విలీనంతో లక్షకు పైగా జనాభాతో 39 వార్డులతో పట్టణ రూపురేఖలు విశాలమయ్యాయి. దేశంలోనే తొలి నేతన్న కాంస్య విగ్రహం సిరిసిల్లలో ఉంది. జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణం చుట్టూరా బైపాస్రోడ్లు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కలెక్టరేట్తో విస్తరించింది. గతంలో మంజూరు చేసిన పనులు, నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఏడాదిగా అభివృద్ధి ముందుకుసాగడం లేదు.
నేడు బాధ్యతలు స్వీకరణ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు విడుదల కావడం లేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. కొత్తగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిల్ గతంలోని నిధులను మంజూరు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అభివృద్ధి పనులు కాకుంటే.. పాలకులను నిలదీసే సత్తాను కూడగట్టుకోవాలి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా పట్టణ ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని కొత్త కౌన్సిల్పై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
సిరిసిల్ల కొత్త బస్టాండు దుస్థితి
చంద్రంపేట వద్ద ధ్వంసమైన డివైడర్
చిన్నపాటి వర్షం పడితే చాలు.. సర్ధార్నగర్, పాతబస్టాండు, నేతన్నచౌక్, సంజీవయ్యనగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలుస్తుంది.
పట్టణంలోని ప్రధాన రహదారులపై గుంతలు పడ్డాయి. కేబుల్ వైర్ల కోసం తవ్విన గుంతలు అలాగే ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మళ్లీ పందుల సమస్య ఎదురవుతోంది.
రాజీవ్నగర్, పెద్దూరు, చిన్నబోనాల, రగుడు, చంద్రంపేట, సర్ధాపూర్ ప్రాంతాల్లో వీధిదీపాల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. శివారు ప్రాంతాలు చీకట్లో మగ్గిపోతున్నాయి.
బైపాస్రోడ్లను కలిపే లింకురోడ్ల ఫార్మేషన్ పెండింగ్లో పడింది.
సిరిసిల్ల జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగాయి. ఓపెన్జిమ్ కూడా లేదు.
పట్టణ సుందరీకరణ పనులు శిథిలమయ్యాయి. కొత్త చెరువుతోపాటు పట్టణ ప్రధాన కూడళ్ల నిర్వహణ నీరుగారుతోంది.
మున్సిపల్ ట్రాక్టర్లు ఆరు, ఆటోలు 14 వరకు మూలనపడ్డాయి.
కొత్త బస్టాండులో రోడ్డు దారుణంగా ఉంది.
జనాభా: 1,12,002,
ఓటర్లు: 81,959, వార్డులు: 39
పట్టణ విస్తీర్ణం : 51.93 చదరపు కిలోమీటర్లు
గృహాలు: 24,721, అక్షరాస్యత శాతం: 73.7
నిలువెల్లా సమస్యలే
నిలువెల్లా సమస్యలే
నిలువెల్లా సమస్యలే


