మహా జనాభిషేకం
వేములవాడలో కిక్కిరిసిన భక్తులు నేడు మహాశివరాత్రి గుడిచెరువులో శివార్చన నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు భక్తుల సమాచారానికి క్యూఆర్ కోడ్
వేములవాడ: మహాశివరాత్రి వేడుకలకు భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తున్నారు. గుడి చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో మొదటిసారి భీమన్న ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసి, లఘు దర్శనాలకు అనుమతించారు. గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చన నిర్వహిస్తున్నారు. 1,500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే ఉత్సవాలు ప్రారంభించారు.
వైభవంగా వేడుకలు ప్రారంభం
మూడు రోజులపాటు భీమన్న ఆలయంతోపాటు రాజన్న ఆలయంలో ఏకాంత సేవలతో ఈ వేడుకలు వైభవంగా కొనసాగనున్నాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభించారు. 5 గంటలకు ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీస్వామి వారికి మహానివేదన సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ అధికారులకు పూలమాలవేసి స్వాగతం పలికారు. గర్భగుడిలో పూజలు నిర్వహించి, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ టీటీడీ తరఫున వేములవాడ దేవస్థానానికి గత 28 ఏళ్లుగా పట్టువస్త్రాలు తీసుకొస్తున్నామని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు
స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్లు
మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జాతర పరిసర ప్రాంతాల్లో 10 హెల్ప్డెస్క్లు, బేబీఫీడింగ్ రూమ్ను ప్రారంభించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రధాన ప్రవేశ ద్వారాలు, హెల్ప్డెస్క్ల వద్ద 100 వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. భక్తులకు తాగునీరు అందించేందుకు స్టీల్ గ్లాసులను వినియోగిస్తున్నారు. భక్తులు దారి తప్పకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ
జాతర ఏర్పాట్లు, సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
మహా జనాభిషేకం
మహా జనాభిషేకం
మహా జనాభిషేకం
మహా జనాభిషేకం


