పీఠం ఎవరికో !
సిరిసిల్ల పీఠంపై వీడని సస్పెన్స్ క్యాంపులో గులాబీ దండు బరిలో నలుగురు అభ్యర్థులు వైస్చైర్మన్ కోసం మరో నలుగురు హ్యాట్రిక్ సంబరాల్లో బీఆర్ఎస్
సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నికకు ఈనెల 16న సమావేశం కానున్నారు. అయితే సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ మహిళకు రిజర్వేషన్ కాగా.. ఆశావహులు కూడా అత్యధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపల్పై వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేయగా.. సోమవారం చైర్పర్సన్ ఎన్నిక జరుగనుంది. ఈమేరకు ఎన్నికల్లో గెలిచిన 27 మంది నూతన కౌన్సిలర్లు శుక్రవారమే క్యాంపునకు వెళ్లారు. మూడు రోజులపాటు క్యాంపులోనే ఉండి.. సోమవారం నేరుగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంటారు. ఈక్రమంలోనే ఈసారి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని సస్పెన్స్ కొనసాగుతోంది.
వరుసగా మూడోసారి బీఆర్ఎస్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వద్దకు గెలిచిన 27 మంది కౌన్సిలర్లు తరలివెళ్లారు. సిరిసిల్లలో చైర్పర్సన్ ఎవరనేది కేటీఆర్ ప్రకటించనున్నారు. ఈమేరకు చైర్పర్సన్ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గతంలో రెండు పర్యాయాలు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కొలువుదీరింది. రెండు సార్లు వరుసగా సామల పావని, జిందం కళను స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఆమేరకే రెండుసార్లు పాలకవర్గం ఏర్పాటైంది. రెండు దఫాల్లో కేటీఆర్ మంత్రిగా సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపించగా.. ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీ ఇచ్చారు. గతంలో కన్నా ఎక్కువ మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు.
వైస్చైర్మన్ గిరిపై కూడా..
చైర్పర్సన్ తర్వాత వైస్చైర్మన్ పదవిపై కూడా చాలా మంది ఆశావహులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కౌన్సిల్లో రెండు, అంతకన్నా ఎక్కువ పర్యాయాలు గెలిచిన వారు వైస్చైర్మన్ పదవిపై ఆశగా చూస్తున్నారు. సీనియర్ కౌన్సిలర్లు గుడ్ల శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, దార్ల సందీప్ ఉన్నారు. కాగా విలీన గ్రామాల నుంచి ఎన్నికై వారిలోనూ వైస్చైర్మన్ పదవి కావాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నట్లు సమాచారం. విలీన గ్రామాల నుంచి బుర్ర మల్లికార్జున్, దొంతవేని కళ్యాణి, లింగంపల్లి భాగ్యలక్ష్మి రేసులో ఉన్నట్లు చర్చసాగుతోంది. పట్టణం నుంచి సీనియర్లు, విలీన గ్రామాల నుంచి రేసులో ఉన్న వారిలో ఎవరికి వైస్చైర్మన్ ఇచ్చినా సమ్మతమే అన్నట్లు అధిష్టానం దృష్టిలో వేసినట్లు తెలిసింది.
కేటీఆర్ నిర్ణయమే ఫైనల్
చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎంపికలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. గతంలో రెండు పర్యాయాలు ఆయనే పార్టీ కౌన్సిలర్లతో సమావేశమై అందరి సమ్మతంతో పదవులు కట్టబెట్టారు. ఈసారి కూడా కేటీఆర్ ఆశీర్వాదం తమకు దక్కాలంటూ హైదరాబాద్ క్యాంపునకు వెళ్లిన అభ్యర్థులు కోరుకుంటున్నారు. రెండోసారి చైర్పర్సన్గా జిందం కళను కొనసాగిస్తారా.. కొత్తవారికి అవకాశం ఇస్తారా.. అనేది సోమవారం తెలియనుంది. ఇక వైస్చైర్మన్గా సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారో.. విలీన గ్రామాల కౌన్సిలర్ల మొర ఆలకిస్తారో కేటీఆర్ తేల్చనున్నారు. చైర్పర్సన్గా జనరల్ మహిళకు రిజర్వ్ ఉండగా వైస్చైర్మన్గా పురుషులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చసాగుతోంది. పదవుల అప్పగింతపై ఆదివారం రాత్రి వరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే క్యాంపులో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
బరిలో ఆ‘నలుగురు’
తాజా, మాజీ చైర్
పర్సన్ జిందం కళను రెండోసారి చైర్పర్స న్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే బరిలో ఉన్న మిగతా ముగ్గురు సైతం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చైర్పర్సన్ రేసులో తాజా, మాజీ చైర్పర్సన్ జిందం కళతోపాటు తాజా, మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ సతీమణి మంచె రేణుక, మాజీ చైర్పర్సన్ గుండ్లపెల్లి సరోజన కోడలు గుండ్లపెల్లి నీరజ, సెస్ డైరెక్టర్, అర్బన్బ్యాంకు మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ సతీమణి దార్నం అరుణ ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికై న వారిలోనూ ఒకరిద్దరు చైర్
పర్సన్ రేసులో ఉన్నట్లు తెలిసింది.


