మీకేం కాదని..
శాతవాహన వర్సిటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి త్వరలో చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కాపాడుతామంటూ తెరపైకి దళారులు తమకు ప్రభుత్వ పెద్దలు తెలుసంటూ భరోసా
మేమున్నామని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అక్రమాల విషయంలో మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. గత వీసీల హయాంలో జరిగిన అక్రమాల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయి ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. త్వరలోనే కొందరు విచారణ నివేదిక మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని అంతా అనుకుంటున్న క్రమంలో కొందరు పైరవీకారుల రంగప్రవేశం చర్చనీయాంశంగా మారింది. తాము విచారణ నివేదికను తొక్కిపెడతామని, బుట్టదాఖలు చేస్తామని, ఎలాంటి చర్యలూ లేకుండా కాపాడతామంటూ బయల్దేరారు. అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో పనిచేసిన వర్సిటీ మాజీ, ప్రస్తుత సిబ్బందికి ఏకంగా అభయమిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతామంటూ భరోసా కల్పిస్తున్నారు.
ఏయే అంశాలపై ఫిర్యాదు చేశారంటే..
ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి నాన్ టీచింగ్ సిబ్బందిని ఇష్టానుసారంగా నియామకం చేయడం, యూజీసీ నియమనిబంధనలు పాటించకుండా రిటైర్డ్ అధ్యాపకులను నియమించడం, అర్హత లేకపోయినా నచ్చిన వారిని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా అక్రమ క్యాష్ ప్రమోషన్లు ఇవ్వడం, 12బీ యూజీసీ గుర్తింపు కోసం తప్పుడు నివేదికలతో ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను తప్పుడు ఆరోపణలతో తొలగించారు. అంతేకాకుండా రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న నాలుగు డిపార్ట్మెంట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం, అర్హతలేని వ్యక్తిని ఫైనాన్స్ ఆఫీసర్గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ను నియామకం చేసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట సిబ్బందిని బెదిరించారంటూ ఆరోపిస్తూ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పెద్దలు తెలుసంటూ..
శాతవాహన యూనివర్సిటీలో మాజీ ఉపకులపతి హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని పలు ఆధారాలతో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, విజిలెన్స్ డీజీకి 2024 జూన్ 18న ఫిర్యాదు వెళ్లింది. శాతవాహన ప్రొటెక్షన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున కోట శ్యాంకుమార్, శ్రవణ్ దాదాపు 15 అంశాలపై పెద్ద నివేదికను ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై 2024 జూలై, ఆగస్ట్లో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 15 నెలల అనంతరం పూర్తి నివేదికను కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి 2025 సెప్టెంబర్లో రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయానికి పంపారు. ఇప్పుడు హైదరాబాద్లోని విజిలెన్స్ ఉన్నతాధికారుల వద్ద నివేదిక ఉంది. గతంలో వర్సిటీలో పనిచేసిన కొందరికి గత ప్రభుత్వ పెద్దలతో బంధుత్వం ఉందని, వారిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారు విజిలెన్స్ నివేదికపై చర్యలు లేకుండా అడ్డుకోగలరని చెబుతున్నారు. దీంతో విజిలెన్స్ విచారణను తొక్కిపెట్టేందుకు తాము సహకరిస్తామని, ఇతర ఉద్యోగుల వద్ద పైరవీలకు దిగుతున్నారు. వీరికి చెక్పెట్టేలా వర్సిటీలో జరిగిన అక్రమాలపై వెంటనే చర్యలు చేపట్టాలని విజిలెన్స్ డీజీ, ముఖ్యమంత్రిని విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.


