
కొనుగోళ్లకు సిద్ధం కావాలి
● 3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ● 235 కొనుగోలు కేంద్రాలు ● ఏ గ్రేడ్ వడ్లు క్వింటాలుకు రూ.2389 ● కామన్ రకానికి రూ.2369 ● ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష
సిరిసిల్ల: జిల్లాలో 3 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని, ఈమేరకు కొనుగోళ్లకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 79, ఐకేపీ ఆధ్వర్యంలో 144, మెప్మా, డీసీఎంఎస్ ద్వారా మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు, తేమశాతం చూసే డిజిటల్ కాలిపర్స్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, గడ్డి, పొల్లు లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, కామన్ రకానికి రూ.2369 మద్దతు ధర నిర్ణయించిందని వివరించారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలో సర్వే నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగుచేశారు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీసీఎస్వో చంద్రప్రకాశ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, డీఏవో అఫ్జల్బేగం, డీఎంవో ప్రకాశ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ కోరారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్లు అయిన సందర్భంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో సదస్సు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.