
ఖైదీలకు ఉపాధి అవకాశాలు
● కరీంనగర్ జైలు బంకు సేవలు భేష్ ● జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా
కరీంనగర్క్రైం: జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, కరీంనగర్లో ఖైదీలు తయారు చేసిన అగర్బత్తీలు రాష్ట్రవ్యాప్తంగా విక్రయమవుతున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జైలుకు ఓ ట్రక్కు, అగర్బత్తీల తయారీ మిషన్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు బహూకరించారు. వాటిని శనివారం జైళ్లశాఖ డీజీ సౌమ్య ఐజీ సంపత్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ్దేని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ స్వామినాథన్తో కలిపి ఆవిష్కరించా రు. అనంతరం మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో జైళ్లశాఖకు పెద్దఎత్తున సహాయం అందించారని తెలిపారు. జైలు, ఇండియన్ ఆయిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరీంనగర్ పెట్రోల్ బంక్ సేవల్లో ప్రథమస్థానంలో కొనసాగుతోందన్నారు. కరీంనగర్ జైలులో తయారవుతున్న అగర్బత్తీలు రాష్ట్రస్థాయిలో పెరుగాంచాయన్నారు. కరీంనగర్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఖైదీలకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జైలులో ఖైదీల యోగక్షేమాలు, సదుపాయాలను పరిశీలించారు. జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, ఎ.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎల్.రమేశ్, అజయ్చారి ఉన్నారు.