
రాజీయే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్లకల్చరల్: తగాదాల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చర్చల ద్వారా అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా కోర్టు సముదాయంలో 6,714 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 883 కేసుల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. అదాలత్లో తీర్పు వస్తే పై కోర్టులో అప్పీల్కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల విభేదాలు, బీమా సంబంధ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
‘మినీ స్టేడియం మంజూరు చేయండి’
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రంలో మినీస్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి లేఖ రాశారు. ఈమేరకు ఎమ్మెల్యే సత్యం రాసిన లేఖను కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ బుధవారం శివసేనారెడ్డికి అందించారు. బోయినపల్లిలోని సర్వేనంబర్ 139లో 4 ఎకరాల భూమి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
శ్రీవారి ప్రసాద వేలం రూ.1.93 లక్షలు
సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 29 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రసాద విక్రయాలకు బుధవారం టెండర్లు నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు వివరాలు వెల్లడించారు. లడ్డు, పులిహోర, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు బహిరంగ వేళలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. లడ్డు, పులిహోర ప్రసాదం రూ.1.48లక్షలు, కొబ్బరిముక్కలు పోగు చేసుకోవడానికి రూ.45,666 టెండర్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈవోలు రవీందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది కన్నా రూ.25,550 అధిక ఆదాయం సమకూరిందన్నారు.
చిటికెన కిరణ్కు వడ్డేపల్లి కృష్ణ పురస్కారం
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన లలిత గీతాల కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ స్థాయిలో సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసేందుకు నిర్ణయించింది. తొలి పురస్కారాన్ని పట్టణానికి చెందిన వ్యాసకర్త చిటికెన కిరణ్కుమార్కు అందజేయాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.

రాజీయే రాజమార్గం

రాజీయే రాజమార్గం