
జనాభా నియంత్రణ అందరి బాధ్యత
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని, జనాభాను నియంత్రించినప్పుడే సహజ వనరులపై ఒత్తిడి తగ్గి భవిష్యత్ తరాలకు అవి అందుతాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ పీహెచ్సీలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జనాభా అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి రజిత ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫెర్టిలిటీ రేటు 2.1 కంటే తక్కువగా ఉండాలని, జిల్లాలో 1.6శాతంగా ఉందన్నారు. అర్హులైన వారికి సిరిసిల్ల, వేములవాడ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలన్నారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు ఏంజెలీనా, అనిత, సంపత్, గీతాంజలి, సీహెచ్వో మెంగని లింగం, యాదగిరి పాల్గొన్నారు.
ఉత్తమ సర్జన్గా డాక్టర్ పెంచలయ్య
జిల్లాలో ఉత్తమ సర్జన్గా డాక్టర్ పి.పెంచలయ్య ప్రశంసాపత్రాన్ని కలెక్టర్ చేతులమీదుగా అందుకున్నారు. జిల్లాలో అత్యధిక సర్జన్లు చేసిన పెంచలయ్య సేవలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.
అర్హులకు ఇండ్లు
అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, గూడెంలో డబుల్బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి లాటరీ ద్వారా ఎంపికై న వారికి ఇండ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేశారు. 94 మందికి పట్టాలను అందజేశారు. కొండాపూర్ డబుల్బెడ్రూమ్ ఇళ్లలో ప్లంబింగ్, రోడ్డు పనుల కోసం రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, పీడీ హౌసింగ్ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, మండల ప్రత్యేకాధికారి భారతి, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ బాధిత కుటుంబానికి పరిహారం
గల్ఫ్ బాధిత కుటుంబానికి పరిహారం చెక్కును కలెక్టర్ సందీప్కుమార్ ఝా శుక్రవారం అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ముత్యం వెంకటేశం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లి అనారోగ్య కారణాలతో మరణించాడు. వెంకటేశం పనిచేసిన కంపెనీ నుంచి రూ.10,81,121 పరిహారం చెక్కు వచ్చింది. వెంకటేశం భార్య ముత్యం పద్మకు చెక్కు అందజేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రత సమావేశం నిర్వహించి మాట్లాడారు. సిరిసిల్ల, వేములవాడ ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల పక్క ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్లను మూసివేయాలని, అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేసేందుకు స్పీడ్గన్స్ కొనుగోలు చేయాలన్నారు. సిరిసిల్లలోని వెంకటాపూర్ జంక్షన్, వేములవాడ నాంపల్లిరోడ్, అనుపురం, ముస్తాబాద్, తంగళ్లపల్లి, పెద్దూరు, రగుడు జంక్షన్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫోన్ చేయాలి అనే దానిపై ప్రచారం చేయాలన్నారు. రోడ్డుపై ఉన్న అనవసర బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. జిల్లాలోని ప్రతీ విద్యాసంస్థలో రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆర్టీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, డీఈవో వినోద్, డీపీవో షరీఫుద్దీన్, డీఎంహెచ్వో రజిత తదితరులు పాల్గొన్నారు.