అద్దంకి: మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సత్రంలో గురువారం గుర్తు తెలియని వృద్ధురాలు మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అద్దంకి, తిమ్మాయపాలెం పరిసర ప్రాంతాల్లో యాచిస్తూ జీవించే ఈ వృద్ధురాలు గత నాలుగైదు రోజులుగా దర్శి రహదారి పక్కనున్న సత్రంలో రాత్రివేళల్లో నిద్రిస్తోంది. గురువారం ఉదయం ఎంతకీ నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించి, ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
మద్దిపాడు: మండల కేంద్రమైన మద్దిపాడు నుంచి నందిపాడు వెళ్లే రహదారిలో గల పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. మంగళవారం రాత్రి పూజారి ఆలయానికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం స్థానిక లారీ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ఊరేగింపు గుడి వద్దకు చేరుకోగా, తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పూజారికి సమాచారం అందించారు. దొంగలు ఆలయంలోని హుండీలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇటీవల శ్రావణమాసం సందర్భంగా భక్తులు సమర్పించిన మొక్కులు దాదాపు రూ.50 వేల వరకు హుండీలో ఉండవచ్చని సమాచారం. ఈ ఘటనపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


