● వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
మార్కాపురం:
ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరు పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని, లేదంటే ఎర్రజెండాలు పాతి భూ పోరాటాలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లుగా ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదలకు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రికి మనసు రావడం లేదన్నారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఎకరం భూమి 99 పైసలకే ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. వారికి 99 పైసలకే భూములిస్తే తప్పేముందని ఎదుటివారిపై బురదజల్లి ప్రశ్నించడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూ బదలాయింపు నిషేఽధిత చట్టాన్ని సవరణ చేయడం వెనుక అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసైన్ చేసిన భూములు 35 లక్షల ఎకరాలు పేదల వద్ద ఉండాల్సి ఉందని, అయితే అందులో 13 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 20 ఏళ్లకు పైబడి అనుభవంలో ఉన్న వారికి అన్ని హక్కులతో ఫ్రీ హోల్డ్ చేసిందని, చంద్రబాబు ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఆ భూములను హోల్డ్లో పెట్టి అన్నదాత సుఖీభవ, బ్యాంకుల్లో పంట రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల పెన్షన్లు తీసివేశారన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు నాసరయ్య, ఎస్కే ఖాశీం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మోహన్, పవన్ కల్యాణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


