త్రిపురాంతకం: వైఎస్సార్ సీపీకి ఎదురే లేదని, నియోజకవర్గంలో ప్రజలు జగనన్నకు జై కొడుతూ బ్రహ్మరథం పడుతున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని రామసముద్రం వీరాంజనేయస్వామి తిరుణాళ్ల సందర్భంగా శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. నేడు ప్రజలు ఆయన పాలనను ఛీ కొడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అబద్ధాలు, మోసపు మాటలతో కాలక్షేపం తప్ప చేసింది శూన్యమన్నారు. రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలను అటకెక్కించి ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఒక్క ఇల్లూ మంజూరు చేసింది లేదన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు తిరిగి జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారెవరిని వదిలిపెట్టమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడితే భయపడేది లేదన్నారు. అధికారులు, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని అలా కాకుండా విరుద్ధంగా పనిచేస్తే వారికి తగిన విధంగా సమాధానం చెబుతామన్నారు. ఒకే జెండా కింద అందరం కలిసి కట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయ భేరి మోగించాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో పనిచేయాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈయన వెంట ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, పార్టీ నాయకులు ముసలారెడ్డి, గంటా రమణారెడ్డి, బాలకోటిరెడ్డి, డి.కోట సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, డి.చిన్న రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో బాబు ప్రభుత్వం విఫలం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీకి ఎదురే ఉండదు
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


