సంఘటన స్థలంలో బోల్తా పడిన ఆటో, కూలీలు
క్షతగాత్రులకు 108 వాహనంలో చికిత్స
కొనకనమిట్ల: మిర్చి కోతలకు వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన 565 జాతయ రహదారిపై కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల సబ్స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పెదారికట్లకు చెందిన 10 మంది కూలీలు ఆటోలో మిర్చి కోత కోయడానికి కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్నారు. ఆటో చినారికట్ల జంక్షన్ దాటి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే రోడ్డుకు అడ్డంగా అడవి పందులు వచ్చాయి. వేగంగా వెళ్తున్న ఆటో పందులను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మిగిలిన వారిని మోస్తరు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వెద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరసమ్మ, చెన్నమ్మ, గురవమ్మను మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మిర్చి కోతలకు వెళ్లే క్రమంలో అదుపు తప్పిన ఆటో
8 మందికి గాయాలు


