● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు టౌన్: సఖీ వన్ స్టాప్ సెంటర్లో అందిస్తున్న వైద్య, పోలీస్, కౌన్సిలింగ్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ సూచించారు. బుధవారం నగరంలోని జీజీహెచ్ పరిధిలో గల సఖి వన్స్టాప్ సెంటర్ను ఆయన సందర్శించారు. అక్కడున్న బాధితులను పరామర్శించి ఉచిత న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా న్యాయవాదిని నియమించి న్యాయసహాయం అందించనున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి మహిళ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వలన కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. అనంతరం రాంనగర్లోని బాలసదన్, శిశుగృహను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. వసతి, భోజన సౌకర్యాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సఖీ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ, ఏఎస్ఐ వేమా గౌతమి, ఐసీడీఎస్ సిబ్బంది అనిత, లక్ష్మీ ప్రసన్న, జోనల్ లీగల్ అడ్వైజర్ బి.రత్నప్రసాద్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


