రాచర్ల: మండలంలోని అనుములపల్లె గ్రామ సమీపంలోని 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సమీసపంలోని కొండ ప్రాంతంలో మెస్సర్స్ ఇండోసోల్ సోలార్ కంపెనీ సర్వే నంబర్ 732లోని 12.50 హెక్టర్లల్లో తెల్లరాయి తవ్వేందుకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ పెంచల ప్రభాకర్, నెల్లూరు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్ అధ్వర్యంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుములపల్లె గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మాట్లాడుతూ మైనింగ్ చేసే ప్రాంతంలో పంటపొలాలు, పశువులకు ఎలాంటి హానీ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గొర్రెలు, మేకలు మేతకు వెళ్లేందుకు కాపరులు ఇబ్బందులు పడతారని, అనుములపల్లె గ్రామం మీదుగా వెళ్లే రోడ్డును విస్తరణ చేయాలని కోరారు. మైనింగ్ చేసే సమయంలో చుట్టపక్కల ఉండే రైతులకు, గొర్రెల కాపరులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామాల్లో వైద్య సేవలందించాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని కోరారు. ఈ సందర్భంగా పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. కార్యక్రమంలో అనుములపల్లె మాజీ సర్పంచ్ సిరిగిరి రమేష్, జియోలాజిస్ట్ గోవిందరావు, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, వీఆర్ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


