మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీవో, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జలాధార–నీటి భద్రత కార్యక్రమంలో భాగంగా రాబోయే 100 రోజుల్లో మార్కాపురం జిల్లాలో భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వీబీజీ రామ్ జీ పథకంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ముందుగా పది రోజుల యాక్షన్ప్లాన్ను తయారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 80 రోజుల ప్రణాళికలో జిల్లాలోని చెరువుల పూడిక తీయటంతోపాటు భూగర్భ జలాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించారు. జలాల మట్టాన్ని కనీసం 1.5 మీటర్లు పెంచాలన్నారు. వేసవికి ముందు 6 మీటర్ల లోపు వర్షాకాలం తర్వాత 3 మీటర్ల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, అధికారులు పాల్గొన్నారు.


