మార్కాపురం రోడ్.. మౌలిక వసతులు బ్యాడ్.!
అమృత భారత్ పథకం కింద కేటాయించిన నిధులతో రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వెయిటింగ్ హాలు, ప్లాట్ఫాంల విస్తరణ, డిజిటల్ బోర్డులు, దివ్యాంగులకు ఇబ్బందిలేకుండా లిఫ్టుల ఏర్పాటు, తాగునీరు, స్నానాల గదులు, టాయిలెట్లు, 3వ ప్లాట్ఫాంలకు షెడ్ల నిర్మాణం, ఎలక్ట్రికల్, తదితర పనులు చేపట్టాలి. అయితే, ఆయా పనులన్నీ మార్కాపురం రైల్వేస్టేషన్లో నెమ్మదిగా సాగుతున్నాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు అభివృద్ధి పనులపై సీతకన్ను వేశారు. అమృత్ భారత్ పథకంలో నిధులు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టలేదు. దీంతో ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 2014–19 మధ్య వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయించడంతో అప్పట్లో అభివృద్ధి పనులు జరిగాయి.
మార్కాపురం:
పశ్చిమ ప్రకాశంలోనే ప్రధాన రైల్వేస్టేషన్ మార్కాపురం రోడ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వెళ్లేందుకు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారంతా మార్కాపురం రైల్వేస్టేషన్లో దిగాల్సిందే. అయితే, ఈ రైల్వేస్టేషన్లో పలు సమస్యలు ప్రయాణికులను వేధిస్తున్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు 21.50 కోట్ల రూపాయలు కేటాయించింది. కంభం రైల్వేస్టేషన్కు రూ.11.72 కోట్లు, గిద్దలూరు రైల్వేస్టేషన్కు రూ.11.72 కోట్లు కేటాయించారు. గతేడాది ఫిబ్రవరి 24న వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ఈ పనులను ప్రారంభించారు. మొదట్లో పనులు వేగంగా సాగినా ఆ తరువాత నత్తనడకతో పోటీపడుతున్నాయి. దీంతో అభివృద్ధిలో వెనుకబడిన మార్కాపురం రైల్వేస్టేషన్లో సమస్యలు కూత పెడుతున్నాయి. ప్రతిరోజూ మార్కాపురం రైల్వేస్టేషన్ నుంచి సుమారు 4 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కంభం రైల్వేస్టేషన్ ద్వారా 2 వేల మంది, గిద్దలూరు రైల్వేస్టేషన్ ద్వారా సుమారు 3 వేల మంది నిత్యం ప్రయాణిస్తున్నట్లు అంచనా.
మార్కాపురం రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ సుమారు 20 రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా హుబ్లీ, తిరుపతి, ప్రశాంతి, అమరావతి, ధర్మవరం, వాస్కోడిగామా, డోన్, కాచిగూడ, అనంతపురం, నర్సాపూర్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటితో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, ఒడిశా తదితర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు కూడా ప్రయాణిస్తుంటాయి.
మార్కాపురం రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తాగునీటి సమస్య ఉంది. ప్రయాణికులు మినరల్ వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసి మంచినీరు తాగాల్సి వస్తోంది. స్టేషన్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లను వాడేందుకు కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో అవి ఉపయోగపడటం లేదు. నాణ్యమైన ఫుడ్ను వెండర్లు అమ్మడం లేదు. నాసిరకమైన ఆహార పదార్థాలు అమ్మడంతో ప్రయాణికులు ఆహార పదార్థాలను ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటు వెండర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. టూ వీలర్లు బుక్ చేసినప్పుడు అధిక మొత్తంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.
స్టేషన్లో సమస్యలు...
ప్రతిరోజూ సుమారు
20 వరకూ రైళ్ల రాకపోకలు...
అధికారుల దృష్టికి తీసుకెళ్లా :
పశ్చిమ ప్రకాశంలో రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుంటూరు రైల్వే డివిజన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్రధానంగా డార్మెటరీ రూమ్, వెయిటింగ్ హాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, లిఫ్టు సౌకర్యం పనులను త్వరగా పూర్తిచేయాలని కోరాను. వినతిపత్రం కూడా అందజేశాను.
ఆర్కేజే నరసింహం, డీఆర్యూసీసీ
మెంబరు, గుంటూరు రైల్వే డివిజన్
సమస్యలు పరిష్కరించండి :
మార్కాపురంరైల్వేస్టేషన్లో సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలి. ప్రధానంగా శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. వెయిటింగ్ హాలు త్వరగా పూర్తిచేయాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలి.
ఓఏ మల్లిక్, ప్రయాణికుల సంఘం
అధ్యక్షుడు, మార్కాపురం
మార్కాపురం రోడ్.. మౌలిక వసతులు బ్యాడ్.!
మార్కాపురం రోడ్.. మౌలిక వసతులు బ్యాడ్.!
మార్కాపురం రోడ్.. మౌలిక వసతులు బ్యాడ్.!


