
నిరసన గళం
జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని విచారణల పేరుతో వేధించడం తగదు అక్రమ కేసులను ఆపకపోతే ఉద్యమం మరింత ఉధృతం నినదించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనలు
సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు హేయమైన చర్య
చేతులకు సంకెళ్లతో వినూత్న ర్యాలీ
సాక్షిపై కేసులు ఎత్తివేయాలి
నియంత పాలనపై
కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది
ఒంగోలు సిటీ:
ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా అంతటా విలేకర్లు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, వివిధ మీడియా ప్రతినిధులు, సాక్షి విలేకర్లు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్ మాట్లాడుతూ ఎలాంటి వార్తలు రాయాలో పోలీసు వ్యవస్థ నిర్దేశించడం సరికాదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్లో జర్నలిస్టులు రాయలేరని అన్నారు. పత్రికా వ్యవస్థను కూల్చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక సాక్షి పత్రిక, మీడియాలపై కక్ష పూరితంగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పత్రిక ఎడిటర్ను, విలేకర్లను విచారణ పేరుతో రకరకాలుగా ప్రశ్నలతో వేధిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఒంగోలు ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసేందుకు జర్నలిస్టులపై కేసులు పెడుతోందన్నారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కేలా చూడడం సరికాదన్నారు. జర్నలిస్టులు రాయడానికి ప్రయత్నిస్తే వారి ఇళ్లకు వెళ్లి బెదిరించడం, ప్రజల పక్షాన నిలిస్తే తప్పు అన్న విధంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. కల్తీమద్యం మీద సాక్షి జర్నలిస్టులు వార్తలు రాస్తే వారి ఇళ్లకు పోలీసులు పోయి నోటీసులు ఇవ్వడం, స్టేషన్కు తీసుకొచ్చి విచారించడం వంటి సంఘటనలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఒక చిన్న వార్త రాసినందుకు నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డిని 60 ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ఇదేమైనా సీబీఐ కేసా లేదా ఈడీ కేసా అని ప్రశ్నించారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తే వారు వార్తలు రాయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఉన్నారని, ఆ పరిస్థితి ఉండదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డికి ఇటువంటి పరిస్థితులు సృష్టించడం చాలా దారుణమన్నారు. జర్నలిస్టులను వేధింపులకు గురిచేస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసరావుకు వినతి పత్రాలు అందజేశారు. ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఇఫ్తార్ బాషా, ఎంసీఏ అధ్యక్షుడు వేల్పూరి నాగేశ్వరరావు, ఎంసీఏ మాజీ అధ్యక్షుడు ఇఫ్తేకర్ బాషా, ఏపీపీజేఏ రాష్ట్ర సభ్యులు ఎం.ప్రసాద్, ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి సునీల్, ఏపీయూడబ్ల్యూజే మాజీ జాయింట్ సెక్రటరీ బైనబోయిన మాల్యాద్రి, జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు రూరల్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డితో పాటుగా సాక్షి విలేకరుల పై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్యగా భావించాలని సీఐటీయూ నాయకులు టి.ఆవులయ్య అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులకు నిరసనగా గిద్దలూరులోని జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సాక్షి కార్యాలయాల పై జరుగుతున్న దాడులు అప్రజాస్వామ్యమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఎం.రాజ్కుమార్, రఫీ, యాకుబ్ ఖాన్, రసూల్, ఖాజా, యల్లా శివ, నెమలిగుండం, గిరి, మూర్తి, శేఖర్, కాకి అంకయ్య, ఆచారి, రమేష్, కాశీ, సీఐటీయూ నాయకులు నరసింహులు, ఆర్ట్ ఆఫ్లివింగ్ యోగా టీచర్ బి.ఎస్.నారాయణరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాజా, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా ప్రబలిపోతుందని, అనేక మంది పేదలు మృత్యువాత పడ్డారని వార్తలు రాసిన సాక్షి జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, సాక్షి దిన పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిని గంటల తరబడి విచారణ పేరుతో వేధించడం తగదని, అక్రమ కేసులను ఎత్తివేయాలని స్థానిక జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్కు వినతి పత్రం అందజేశారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, చేతులకు సంకెళ్లు వేసుకొని పత్రిక స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల చేతులకు సంకెళ్లు వేస్తామనుకోవడం అవివేక చర్య అని నినదించారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్లూజే మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్.నూరుద్దీన్, త్రిపురాంతకం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేషు, జర్నలిస్టులు సయ్యద్ షాకీర్ హుస్సేన్ (సర్దార్), షేక్.మహబూబ్ బాష, శంకర్ నాయక్, ఎన్.వెంకోబరావు, ఎస్.సూర్యనారాయణబాబు, ఎ.సత్యనారాయణరెడ్డి, పి.అయూబ్ ఖాన్, డి.లాలు, సుభాష్, యు.ఏసోబు, లక్ష్మిరెడ్డి, జి.కోటేష్, ఎ.అనిల్కుమార్, ఎ.ఏసుబాబు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ డిమాండ్
మార్కాపురం: ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితోపాటు ఇతర పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వీ రమణ కోరారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలో పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సబ్కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్కు వినపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ పాలకులకు పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చని, అలా కాకుండా పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదుచేయడం, పత్రికా కార్యాలయాల్లో సోదాలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు జీఎల్ నరసింహారావు, బీ మల్లిఖార్జునరావు, బీ రామయోగయ్య, పీ నరేంద్ర, శేఖర్, బూదాల సురేష్, అనీల్కుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిన్నబాబు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన గళం

నిరసన గళం

నిరసన గళం