
క్విస్లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
● సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
ఒంగోలు సిటీ: శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ , ఇస్రో, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి షార్ డైరెక్టర్ పద్మకుమార్, అసోసియేట్ డైరెక్టర్ ముత్తుచెరియన్, క్విస్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి దేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పద్మకుమార్ విద్యార్థులకు షార్, ఇస్రో పనితీరును వివరించారు. రాకెట్ లాంచింగ్ ఏ విధంగా ప్రారంభమైందో వివరించారు. రానున్న కాలంలో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేస్తోందని, దానికి అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది లివ్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్తో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, స్పేస్ ట్రావెల్ ఎలా ఉంటుంది? స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను సామాన్యులకు తెలిసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసోసియేట్ డైరెక్టర్ ముత్తుచెరియన్ మాట్లాడుతూ షార్, ఇస్రో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసిందన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో తమ టెక్నాలజీని వాడుతున్నారన్నారు. ఓషన్ టెక్నాలజీలో సైతం ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు.
అలరించిన అంతరిక్ష ప్రదర్శన...
అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 2000 మంది విద్యార్థులు ప్రదర్శనను వీక్షించారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ హనుమంతరావు, డీపీఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, సీఎస్ సీడీఈ డీన్ డాక్టర్ భార్గవ్, వరల్ట్ స్పేస్ వీక్ – 2025 ఒంగోల్ సబ్ కమిటీ ఛైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.