
రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులు
అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు వైఎస్సార్ సీపీ బలోపేతానికి చర్యలు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ఒంగోలు సిటీ: కూటమి పాలన నానాటికీ దిగజారుతోందని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యూరియా గురించి తాము మాట్లాడితే అబద్ధమంటారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం యూరియా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. రోడ్లు బాగలేవని తమ నియోజకవర్గాల్లో ప్రజలు తిరగనిచ్చే పరిస్థితులు లేవని అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాపోతున్నారన్నారు. లంచాలు తీసుకుంటున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని కారుమూరి దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పంటలను రోడ్డుపై పారబోసుకుంటున్నారని వాపోయారు.
కార్యకర్తలే వెన్నెముక..
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే వెన్నెముక అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే చంద్రశేఖర్, అన్ని వర్గాల ఇన్చార్జిలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. డిసెంబరు నెలాఖరులోపు కార్యకర్తలకు ఐడీ కార్డులు, బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలతో ఇబ్బందులు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని కారుమూరి చెప్పారు. గ్రామస్థాయిలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా క్షణాల్లో అధిష్టానం దృష్టికి వచ్చేలా ఇది ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, ఎస్ఎన్పాడు ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మార్కాపురం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైజాగ్ పార్లమెంట్ అబ్జర్వర్ కదిరి బాబురావు, కనిగిరి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఆదెన్న, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మీరావలి, తదితరులు పాల్గొన్నారు.