
అడ్డుకుంటాం
పార్టీ శ్రేణులు తరలిరావాలి
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను
మార్కాపురం:
వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయకపోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం మార్కాపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజీ వాల్పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేసేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 19న యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కళాశాలను సందర్శించనున్నట్లు అన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 17 మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు జగనన్న అనుమతులు తీసుకొచ్చారని వివరించారు. ఇప్పటికే 5 కళాశాలల్లో క్లాసులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పాడేరు, పులివెందులలో మెడికల్ కళాశాలలను గత ఏడాది నుంచి క్లాసులు జరగాల్సి ఉండగా మెడికల్ సీట్లు అవసరం లేదని ఎన్ఎమ్సీ బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. నీట్ ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఇష్టపడతారని తెలిపారు. మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభం కావాల్సి ఉందని, అందుకు తగ్గట్టు గత ప్రభుత్వంలోనే మార్కాపురం జీజీహెచ్లో బెడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.475 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారని వివరించారు.
పేదలపై పెను భారం
మెడికల్ కళాశాలను ప్రైవేటుకు కేటాయించి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపడం సమంజసం కాదని అన్నా రాంబాబు పేర్కొన్నారు. మార్కాపురం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరంకాకుండా అడ్డుకునేందుకు నిరసనలు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంలో మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం కాకుండా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేయాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ దొనకొండలో రాజధానిని ఏర్పాటుచేయాలని కోరిందని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారి సూచనలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ ప్రాంతంపై వివక్ష తగదని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకే ఈ ప్రాంతంలో గ్యాస్ ప్లాంట్లు కడతామని చెబుతున్నారని, సాగునీరు, పరిశ్రమలు లేని ఈ ప్రాంతంపై జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామన్నారు.
పశ్చిమ ప్రకాశంపై వివక్షలో భాగమే ప్రైవేటీకరణ
ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ప్రైవేటీకరణను ఆపుతాం
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉద్ఘాటన
శుక్రవారం నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలని అన్నా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, జెడ్పీటీసీ సభ్యుడు నారు బాపన్రెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సలీమ్, కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ, సిరాజ్, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మక్బుల్ బాషా, నాయకులు రామసుబ్బారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పి.చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, గొలమారి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.