
పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్టౌన్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు పొందగొరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్లో కళాశాల లాగిన్లో దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మానాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ నుంచి పీజీ వరకూ విద్యనభ్యసిస్తున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపల్స్ కళాశాల లాగిన్లో నమోదు చేయాలన్నారు. నూతన, రెన్యువల్ ఉపకార వేతనాలు నమోదు చేయాలని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం సచివాలయాలకు పంపించాలన్నారు. అర్హత కలిగిన విద్యార్థి ఉపకార వేతనం పొందకపొతే కళాశాలలను బాధ్యులను చేస్తామన్నారు.
సింగరాయకొండ: జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాతసింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ పద్మజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన మూడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొని విజేతగా ఎంపికై న ప్రకాశం జిల్లా జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరచిన పాఠశాల విద్యార్థులు ఎం దిలీప్, డీ అక్షర, ఏ వర్షిణిలు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికై నట్లు వివరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో అక్టోబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పీ శ్రీనివాసరావు, ఎమ్డీ అన్వర్లను ప్రత్యేకంగా అభినందించారు.
ఒంగోలు సబర్బన్: రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో పీఆర్సీ కమిటీని నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ చర్చా కార్యక్రమం మంగళవారం పెళ్లూరు కాలనీలోని పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగులకు ఎలాంటి డిమాండ్లు తీర్చలేదన్నారు. తొలుత రాష్ట్ర అధ్యక్షుడు సూర్య నారాయణ సందేశం వీడియోను అధికారులు, సిబ్బందికి చూపించారు. కార్యక్రమంలో పే అండ్ అకౌంట్స్ శాఖ ఉద్యోగులు నరసింహారావు, రమేష్, వెంకటేశ్వరరావు, బాష, సురేష్, మల్లిక, రాజేశ్వరి, కల్పన, శోభ మాలిని, అనిత, మణి, నాగలక్ష్మి, తేజస్విని తదితరులతో పాటు ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పీసీపల్లి: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో భాగంగా మండల పరిధిలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ అజయ్ మిశ్రా, డాక్టర్ భార్గవి, డాక్టర్ చరిత పరిశీలించారు. ఇక్కడ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి సుమారు 50 ఏళ్లైందని, వర్షానికి కారుతున్నాయని, శ్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని పలు సమస్యలను డాక్టర్ యశ్విత, డాక్టర్ మంజుల వారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇక్కడ క్వార్టర్స్ పూర్తిగా శిథిలమైపోయాయని నూతన క్వార్టర్స్ నిర్మిస్తే నర్సులు ఇక్కడే ఉండి సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రోగులతో కూడా మాట్లాడారు. రాత్రి అయితే ఒక్క డాక్టర్ కూడా ఇక్కడ ఉండరని, చుట్టూ సుమారు 50 గ్రామాలు పైగా ఉన్నాయని ఏదైనా అత్యవసరమై ఆస్పత్రికి వస్తే, ప్రథమ చికిత్స చేసే వారే ఉండరని రోగులు తెలిపారు. ఉన్న ఇద్దరు డాక్టర్లు కూడా ఎవరో ఒకరే ప్రతిరోజు అందుబాటులో ఉంటారని, మరొకరు క్యాంపులను, మీటింగులకు వెళ్తుంటారని చెప్పారు. రాత్రి సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని రోగులు కోరారు.