
నేడు ఈతముక్కల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కొత్తపట్నం: మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఉన్న ఎస్యూవీఆర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికిగానూ డీసీసీపీ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా మంగళవారం భర్తీ చేయనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వి.ఏసుప్రసాద్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. పాలీసెట్ – 2025 ఎంట్రెన్స్ రాసి అర్హులై కౌన్సిలింగ్కు హాజరుకాని వారు, ఎంట్రెన్స్లో క్వాలిఫై కానివారు, దరఖాస్తు చేసి పరీక్ష రాయని వారితో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు అయిన వెంటనే ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు తన మొబైల్ నంబర్ 9441885492ను సంప్రదించాలని కోరారు.
రేపు జూనియర్ టార్గెట్ బాల్ ఎంపిక పోటీలు
సింగరాయకొండ: మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా జూనియర్ టార్గెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు టార్గెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ మునీర్ తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటో తేదీకి ముందు జన్మించిన వారు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు 9701523167ను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు.
గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలి
● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య
మార్కాపురం: గ్రంథాలయాల్లో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికపై భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం డీవైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ గ్రంథాలయాల్లో 974 పోస్టులు, స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1800 పోస్టులు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో 300 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి లైబ్రేరియన్ కోర్సు చేసిన వారికి వయసు పెరిగిపోతోందని, ఈ విషయమై విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసినా ఫలితం లేదన్నారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం గ్రంథాలయ శాఖ ఖాళీ పోస్టుల సాధన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్ష్య కార్యదర్శులుగా సీహెచ్ మణికంఠ, ఎం.చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్యాంబాబు, బాదరయ్య, శివ, సభ్యులుగా గురవయ్య, తేజ, మల్లికార్జున తదితరులను ఎన్నుకున్నట్లు డివిజన్ అధ్యక్షుడు షేక్ జబ్బార్ తెలిపారు.
11 నుంచి ఉచిత శిక్షణ
ఒంగోలు వన్టౌన్: సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారం ఇన్స్టాలేషన్, సర్వీసింగ్పై ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పొందగోరే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు.