
అమృత్ భారత్.. నత్తనడక.!
కంభం:
అమృత్ భారత్ పథకం కంభం రైల్వేస్టేషన్లో నత్తనడక నడుస్తోంది. ఈ పథకం కింద ఎంపికై న కంభం రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో సుమారు 3 సంవత్సరాల క్రితం చేపట్టిన అభివృద్ధి పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంభం రైల్వేస్టేషన్కు చుట్టుపక్కల మండలాల నుంచి నిత్యం వందలాదిమంది ప్రయాణికులు వస్తుంటారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆర్మీలో పనిచేసే వారు అధికంగా ఉండటంతో వారంతా కుటుంబాలతో కలిసి రైళ్లలోనే వెళ్తుంటారు. అందుకోసం కంభం రైల్వేస్టేషన్నే ఆశ్రయిస్తుంటారు. రాత్రి సమయాల్లో రైళ్ల కోసం వేచి చూస్తుంటారు. నిత్యం వందలాదిమంది ప్రయాణించే కంభం రైల్వేస్టేషన్లో అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు అవస్థపడుతున్నారు.
అమృత్ భారత్ పథకంలో మూడు సంవత్సరాల క్రితం కంభం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నేటికీ అరకొరగానే జరిగాయి. అదనపు గదుల నిర్మాణం, వెయిటింగ్ హాలుకు మరమ్మతులు, ప్లాట్ఫాంల పెంపు, గ్రానైట్, టైల్స్ ఏర్పాటు, రైల్వే స్టేషన్ ముఖద్వారం ఆధునికీకరణ, ప్రాంగణం చుట్టూ ప్రహరీ, పార్కింగ్ టైల్స్ వంటి పనులు చేపట్టారు. మొదటి ప్లాట్ఫాం నుంచి రెండో ప్లాట్ఫాంకు వెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో లిఫ్ట్ నిర్మాణం పూర్తవగా, మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. అభివృద్ధి పనులన్నీ పూర్తయితేనే కంభం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కంభం, అర్థవీడు, బేస్తవారిపేట, కనిగిరి మండలాల నుంచి ప్రయాణికులు, ఆర్మీ ఉద్యోగులు కంభం రైల్వేస్టేషన్ నుంచే సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిగిరి పట్టణం నుంచి రాత్రివేళ కంభం రైల్వేస్టేషన్కు బస్సు సౌకర్యం కూడా ఉందంటే.. కంభం రైల్వేస్టేషన్కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంభంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతుండగా, గరీభ్ రథ్, పూరీ–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, ధర్మవరం ఎక్స్ప్రెస్, ఇంకా కొన్ని వీక్లీ ట్రైన్స్ ఆపకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ఆర్మీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అన్నిరకాల రైళ్లు కంభం రైల్వేస్టేషన్లో ఆగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రైల్వే ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్నాసేన్ శనివారం కంభం రైల్వేస్టేషన్ను తనిఖీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గతంలోనూ ఉన్నతాధికారులు ఆగ్రహించినా అభివృద్ధి పనులు మాత్రం వేగం పుంజుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
సుమారు 50 ఏళ్లుగా కంభం రైల్వేస్టేషన్లో అందుబాటులో ఉన్న పార్శిల్ సర్వీసులను ఇటీవల నిలిపివేయడంతో వ్యాపారులు, ప్రజలు, ఆర్మీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు ద్విచక్రవాహనాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిలిపివేసిన పార్శిల్ సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని చుట్టుపక్కల మండలాల ప్రజలు కోరుతున్నారు.
కంభం రైల్వేస్టేషన్
కంభం రైల్వేస్టేషన్
అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం
అమృత్ భారత్ పథకం కింద
రైల్వేస్టేషన్కు రూ.11 కోట్లు మంజూరు
పనులు ప్రారంభమై మూడేళ్లు కావస్తున్నా పూర్తి కాని వైనం
ఆలస్యంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం శూన్యం
పనులు పూర్తయితే ప్రయాణికులకు అనేక సౌకర్యాలు
త్వరితగతిన పూర్తిచేయాలంటున్న ప్రజలు
అన్ని రైళ్లు ఆగేలా చూడాలి...
పార్శిల్ సర్వీసులు పునరుద్ధరించాలి...
అరకొరగానే అభివృద్ధి పనులు...
పనుల్లో జాప్యంపై
ఉన్నతాధికారులు ఆగ్రహం...
తరచూ మొరాయిస్తున్న లిఫ్ట్తో
ప్రయాణికులకు ఇబ్బందులు...
నూతనంగా ప్రారంభించిన లిఫ్ట్ తరచూ మొరాయిస్తుంది. దీంతో ప్రయాణికులు రైలు వచ్చేస్తుందన్న తొందర్లో పట్టాలు దాటుకుని రెండో ప్లాట్ఫాంపైకి వెళ్తున్నారు. రెండో ప్లాట్ఫాంలో నీటి సమస్య ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్వోప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో పాటు వెయిటింగ్ హాలు లేకపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫాంపై ఇంకా పార్కింగ్ టైల్స్, గ్రానైట్ పరచలేదు. స్టేషన్ ఆవరణలోని పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. రాత్రివేళ ప్లాట్ఫాంలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అక్కడే మద్యం సేవించి ఖాళీ బాటిల్స్, గ్లాసులను పరిసరాల్లో పడేస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

అమృత్ భారత్.. నత్తనడక.!

అమృత్ భారత్.. నత్తనడక.!

అమృత్ భారత్.. నత్తనడక.!

అమృత్ భారత్.. నత్తనడక.!

అమృత్ భారత్.. నత్తనడక.!

అమృత్ భారత్.. నత్తనడక.!