
ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావివ్వద్దు
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గోపాల కృష్ణ
ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల బాధ్యతలు కీలమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఓటర్ జాబితా తయారీ, బీఎల్ఓ యాప్ నిర్వహణపై ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బీఎల్ఓలకు, బీఎల్ఓ సూపర్వైజర్లకు సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహశీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి ఫీజుల రేట్లు తెలియచేయాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ అల్లోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2002 రూల్ నంబర్ 9 ప్రకారం జిల్లాలోని అన్నీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో వసూలు చేసే ఫీజుల వివరాలను ఇంగ్లిషుతో పాటు స్థానిక భాషలో రిసెప్షన్ కౌంటర్ల వద్ద రోగులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, లేబొరేటరీలలో లభ్యమయ్యే సేవల వివరాలను ఈ నెల 15వ తేదీలోపు జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ మెయిల్కు పంపించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులను మోసం చేసిన మంత్రి లోకేష్
ఒంగోలు టౌన్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ విద్యార్థి లోకాన్ని మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మిరియాలపాలెం సెంటర్లోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూ తూ మంత్రంగా కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నాటికి రూ.3900 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండగా రూ.2600 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆ కేటాయింపులు కేవలం పేపర్ల మీదకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఇంత వరకు కనీసం ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రుపాయికి కూడా రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయని, విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్నా ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తెచ్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఫణిరాజు, మరియబాబు, మధు, హుసేన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావివ్వద్దు

ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావివ్వద్దు