
సుడిగాలులతో అరటి రైతులకు నష్టం
అర్థవీడు: మండలంలో శనివారం రాత్రి వీచిన భారీ సుడిగాలులు, కొద్దిపాటి వర్షానికి అరటి రైతులు నిండా మునిగారు. అంకభూపాలెం గ్రామానికి చెందిన వెంకటస్వామి 3 ఎకరాల అరటి తోట దెబ్బతినడంతో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. బొల్లుపల్లి గ్రామానికి చెందిన రైతులు కొప్పుల అర్జున్రావు, కొప్పుల నారాయణ 4 ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలవాలడంతో రూ.6 లక్షల వరకు నష్టపోయారు. అర్థవీడు గ్రామానికి చెందిన సర్వేశ్వరరావు, దొనకొండ గ్రామంలో మరో ఇద్దరు రైతులకు చెందిన అరటి తోటలు ఈదురుగాలు ధాటికి నేలమట్టమయ్యాయి. దెబ్బతిన్న తోటలను ఆదివారం ఉద్యానవన శాఖాధికారిణి సాయిశ్వేత పరిశీలించారు. కాగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు.
పొలంలో సోలార్ ప్యానళ్లు చోరీ
కొనకనమిట్ల: వ్యవసాయ భూముల్లో ఇద్దరు రైతులు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్లనుగుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రమైన కొనకనమిట్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేంపాటి వెంకటరెడ్డి, వేంపాటి వెంకటేశ్వర్లు ఇటీవల తమ పొలాల్లో పొగాకు సాగు చేశారు. పొగ మొక్కలకు బోరు ద్వారా నీటి తడులు అందించేందుకు రూ.2 లక్షలు వెచ్చించి సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా సోలార్ ప్యానళ్లు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై రాజ్కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి
కొనకనమిట్ల: మండలంలోని పెదారికట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పొదిలి ప్రసాద్ శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. గతంలో ఆయన మునగపాడు, వెలిగండ్ల, సిద్ధవరం, గొట్లగట్లు, గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. గత కొంత కాలంగా పని ఒత్తిడితో సతమతమవుతూ, తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుండె పోటుతో కుప్పకూలి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ మృతిపై మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

సుడిగాలులతో అరటి రైతులకు నష్టం

సుడిగాలులతో అరటి రైతులకు నష్టం