
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయయారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏవిధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
‘‘కూటమి మాయమాటలతో.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ (2024 అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి) దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఈ మధ్య రోజుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే!. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోసిన ప్రతీ కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు.. అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు.
నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది.
గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం. కానీ అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చిందనే కేసు పెట్టారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టి వదిలేయని చెప్పింది.
పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా.
ఈ మధ్య.. ‘నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికేనా?’ అని ఈనాడు లో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్లో మచిలీపట్నంకు సంబంధించిన ఒకటి పోర్ట్.. రెండోది ఇళ్ల పట్టాలు సమస్య చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారు. అయినా కూడా 15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి ఇచ్చాం.
అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది. అప్లికేషను నంబర్ల నుంచి వాటి నరిహద్దులతో సహా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది?. 500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళ్తున్నారట. ఎంతకు అమ్మారు.. పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా? అని అడుగుతున్నారట.

ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు.