సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.
ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.


