
ఏయూక్యాంపస్: రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, ఈ విషయం మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలియకపోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై క్లారిటీ కావాలనుకుంటే యనమల కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించడానికి శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల దిశగా ఏపీ వెళుతోందన్న యనమల మాటలను ఖండించారు. యనమల వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు, ఇప్పటి అప్పులు పోల్చి చూసుకోవాలని అన్నారు.
అనవసరమైన రాజకీయ విమర్శలు చేయడం కన్నా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఇదిలాఉండగా...న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టుకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన పంపినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
పీఎంవో కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్పారు.