
విశాఖ: అమరావతిలో పేదవాడికి సెంటు స్థలం కేటాయించని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన మాత్రం అక్కడ ఐదు ఎకరాల స్థలంలో ఇంటిని కట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తుంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఆంబేద్కర్ ఆశయాల్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
‘ అంబేద్కర్ జాతివాదు కాదు.. జాతీయ వాది. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతిని మరింత విముడింప చేసేలా 125 అడుగుల విగ్రహాన్ని వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు. విజయవాడలో ఉన్న విగ్రహానికి చంద్రబాబు ఎందుకు నివాళులు అర్పించలేకపోతున్నారు.
వైఎస్ జగన్ నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దాన్ని చంద్రబాబు మూసివేస్తున్నారు. అమరావతిలో సెంటు స్థలంలో పేదవాడిని ఇల్లు కట్టుకోనివ్వలేదు సీఎం చంద్రబాబు. కానీ ఆయన మాత్రం అదే అమరావతిలో ఇంటిని నిర్మించుకోవడం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు’ అని జూపూడి ధ్వజమెత్తారు.
రాజధాని కోసం లక్ష ఎకరాలు.. ఇది వ్యాపారం కాదా?
రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరించిన నాయకుడు చంద్రబాబు తప్పితే చరిత్రలో ఎవరూ లేరన్నారు జూపూడి. ‘పేదల భూములతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు..లక్ష ఎకరాల మధ్యలో తన నివాసాన్ని చంద్రబాబు నిర్మిస్తున్నారు.. ఐదు మంది కోసం ఐదు ఎకరాల స్థలంలో భారీ భవనం కడుతున్నారు.. చంద్రబాబు పోకడ రాచరకాన్ని తలపిస్తుంది..రాజధానిలో పేదలకు స్థానం లేకుండా చేశారు. గతంలో తీసుకున్న 54 వేల ఎకరాల్లో ఒక శాశ్వత భవనమైన నిర్మించారా..రాజధానికి రైతులు ఇచ్చిన భూమితో వ్యాపారం చేస్తారా?’ అని జూపూడి ప్రశ్నించారు.