తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానమే లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ విలువలతో కూడిన రాజకీయాలే చేశారని, చంద్రబాబు మాదిరి ఎప్పుడూ హత్యా రాజకీయాలు జగన్ చేయలేదన్నారు జూపూడి. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు.
ఈరోజు(శుక్రవారం, మే 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేమో పిల్లల్ని కని సంపద సృష్టించండి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
‘ఈ రెండేళ్లలో జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపారు. చంద్రబాబు మాత్రం ప్రజలను వదిలేసి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవటం మానేశారు. జగన్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళు ఎలా గెలిచారో పరకాల ప్రభాకర్ను అడిగితే చెప్తారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారు..
కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో అచ్చెన్నాయుడు ఆయన సొంత పార్టీ గురించి ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రజలకి ఇచ్చిన మానిఫెస్టో అమలు చేయమని చెప్పటం తప్పా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు జగన్ అబద్ధాల కోరు అవుతారా ?, జగన్ క్యారెక్టర్ను దెబ్బతీయటం కోసం అనేక కథలు అల్లటం మీకు అలవాటు. జగన్ సూచించిన మావిగన్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వ పెద్దల గుండెలు జారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు.



