తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా, ఇంతవరకూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని, దాన్నుంచి తెప్పించుకునేందుకు జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయని, ఏ వర్గానికీ కూడా మేలు జరిగిన పరిస్థితే లేదన్నారు.
ఈరోజు(మంగళవారం, మే 26వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి.. మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటారు.. వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసన్నారు. జగన్ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు.
కనీసం అప్పులు దేనికి ఖర్చు చేశారో కూడా చెప్పటం లేదు. వైఎస్సార్సీపీ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గతంలో ప్రచారం చేశారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసింది. సంక్షేమం, అభివృద్ధి అజెండా గా మా ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..
గతంలో పవన్ 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయితులపై మాట్లాడే దైర్యం చేయటం లేదు. అప్పట్లో సుగాలీ ప్రీతి విషయంలో ఊగిపోయారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి మేలు జరగటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ అన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవటంతో అనేక విమర్శలు వస్తున్నాయి. డిఎస్సీ లో పేపర్ లీక్ దగ్గర నుంచి అనేక మోసాలు చేశారు..
ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు. కక్ష్య కట్టుకుని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.మెడికల్ కళాశాలల పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరం అస్తవ్యస్తం చేశారు. పోర్ట్స్ కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం అయ్యారు. మంత్రులు తమ శాఖల సంగతి వదిలేసి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్యాబినెట్ మొత్తం జగన్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


